(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ టీ డీ పీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన ఇద్దరు కుమారులతో కలిసి వై సీ పీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వై సీ పీ అధినేత, ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇద్దరు కుమారులు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీని వీడి వైసీపీకి దగ్గర అవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. విశాఖ జిల్లా టీ డీ పీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడాన్ని విశాఖ టీ డీ పి నాయకులు తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు ఎమన్నారంటే…
వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే గుణ పాఠం చెబుతారని అన్నారు చంద్రబాబు. స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ వీడిపోయినా నష్టం లేదనీ, నాయకులు వస్తారు, పోతారు, పార్టీ శాశ్వతం, కార్యకర్తలు శాశ్వతం అని చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు నాయకులు పార్టీకి ద్రోహం చేయడం దుర్మార్ఘమని అన్నారు. పార్టీ ద్రోహులకు తెలుగుదేశం పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం కంచుకోట అని చెప్పుకొచ్చిన చంద్రబాబు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని ఎవరూ తొలగించలేరనీ అన్నారు.