(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు విస్తృతంగా పర్యటించి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ క్యాడర్కు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తొలుత 45 రోజులు అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయాలని చంద్రబాబు భావించారు. అయితే తరువాత తన పర్యటన రోజులను కుదించి రోజుకు ఒక జిల్లా చొప్పున 13 రోజుల పాటు యాత్ర చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
గత నెల 19వ తేదీన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండి చంద్రబాబు ప్రజా (కార్యకర్తల) చైతన్య యాత్రను ప్రారంభించారు. గత నెల 27వ తేదీ విజయనగరం జిల్లా పర్యటనకు బయలుదేరిన చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ విశాఖలో వైసిపి శ్రేణులు, మహిళలు, ప్రజలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నాడు చంద్రబాబుకు పోలీసులు సిఆర్పిసి 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు నుండే నేరుగా హైదరాబాదుకు పంపించారు. అయితే మళ్లీ తాను విశాఖ వస్తాననీ, విజయనగరం జిల్లాలో పర్యటిస్తాననీ చంద్రబాబు ప్రకటించారు.
పరిపాలనా వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ రాజుకున్నది. ఈ కారణంగానే విశాఖకు చెందిన టిడిపి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని పలువురు మంత్రులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. ఈ పరిణామ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను కొనసాగించలేదు.
చంద్రబాబు యాత్రకు అంతగా ప్రజల నుండి స్పందన లేకపోవడం, నిరసనలు వ్యక్తం కావడం వల్లనే యాత్రను కొనసాగించడం లేదని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు పిలుపు మేరకు టిడిపి ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జిలు వారి వారి నియోజకవర్గాల్లో చైతన్య యాత్రలను కొనసాగిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?