TDP Congress : అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ జత కట్టాయి. కలిసి పోటీ చేయాలని సిద్దమైయ్యాయి. పొత్తులపై చర్చలు జరిగాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ టీడీపీ యూటర్న్ తీసుకుంది. దీంతో వీళ్ల మధ్య దోస్తాన్ మూడు నాళ్ల ముచ్చటగా మారింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయించుకుని కాంగ్రెస్ దోస్తాన్ కు కటీఫ్ చెప్పింది.
విషయంలోకి వెళితే..అండమాన్ నికోబార్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మునిసిపల్, పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్చి 6వ తేదీన జరగనుంది. ఇక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ అక్కడ తెలుగు వారు కొంత ఉండటంతో టీడీపీ ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావించింది. ఆ క్రమంలో పొత్తు పెట్టుకునేందుకు కసరత్తు జరిగింది. రెండు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో ఈ ఎన్నికల బరిలోకి దిగుతామని రెండు పార్టీల నేతలు నాలుగు రోజుల క్రితం ప్రకటించాయి. కాంగ్రెస్ టీడీపీ పొత్తు వార్తలు వైరల్ కావడంతో టీడీపీ కేంద్ర నాయకత్వం ఈ పొత్తులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానిక నేతలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉన్న పళంగా టీడీపీ యూటర్న్ తీసుకుంది. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదనీ, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది టీడీపీ. ఈ మేరకు అండమాన్ నికోబార్ దీవుల టీడీపీ నేత మాణిక్యాలరావు ప్రకటన విడుదల చేశారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి మొదటి నుండి పడదు. టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జరిగింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభావంతో టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. టీడీపీలోని సీనియర్ నేతలు, మంత్రులుగా చేసిన వారు, క్యాడర్ అధికార టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయింది. దీంతో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిసి పోటీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా వర్క్ అవుట్ కాలేదు. ఆ తరువాత ఏపిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు దూరం పెట్టారు. ఇందంతా మనకు తెలిసిందే.