అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వైసిపికి జమ కాకుండా ఉంటుందనీ తద్వారా తమకు లాభం చేకూరుతోందని ఎన్నికల ముందు వరకూ టిడిపి వర్గాలు భావించాయి. అయితే వారు అనుకున్నది ఒక్కటి చివరికి అయినది ఒక్కటి. టిడిపి ఇంత ఘోర పరాజయం పాలవ్వడానికి ఒక విధంగా జనసేన కూడా కారణమని ఇప్పుడు ఆ పార్టీ వారు విశ్లేషించుకుంటున్నారు.
వైసిపి విజయం సాధించిన స్థానాల్లో కనీసం 32 స్థానాల్లో వారు సాధించిన మెజార్టీ కంటే జనసేన గణనీయంగా ఎక్కువ ఓట్లు సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 80 స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధించగా ఆయా స్థానాల్లో టిడిపి అభ్యర్థులపై స్వల్ప ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాడు ఐదు వేల ఓట్ల లోపు తేడాతో టిడిపి 28స్థానాల వరకూ కోల్పోయింది.
ఈ సారి ఎన్నికల్లోనూ 32 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ మూలంగా టిడిపి అభ్యర్థులు రెండవ స్థానంలో నిలిచారని పేర్కొంటున్నారు.
యలమంచిలి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి 16500ఓట్లు సాధించగా ఐదు వేల లోపు ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థిపై వైసిపి అభ్యర్థి విజయం సాధించారు. అదే మాదిరిగా రామచంద్రాపురం, తణుకు, విజయవాడ వెస్ట్, నెల్లూరు సిటి, తిరుపతి, పొన్నూరు, ఏలూరు, పత్తిపాడు, ఆచంట తదితర నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థుల విజయావకాశాలపై జనసేన దెబ్బతగిలిందని వారు భావిస్తున్నారు.
ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే ప్రజలు ఇంత ఘోరమైన పరాజయాన్ని టిడిపికి తీర్పుగా ఇచ్చారనీ, దానికి తోడు మూడు పర్యాయాలు చంద్రబాబు పాలన చూసిన ప్రజలలో ఒక్క సారి జగన్కూ అవకాశం ఇద్దాం అన్న భావన పెద్ద ఎత్తున రావడం వల్ల ఎవరూ ఊహించని విధంగా వైసిపికి బ్రహ్మరథం పట్టారని పలువురు చెప్పుకొస్తున్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలిసివచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువ శాతం వైసిపికే నమోదు అవ్వడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.