అమరావతి, జనవరి 26: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం ఆయన అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. బిజెపి సిబిఐ, ఈడిలతో దాడులు చేయించి భయపెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులపై దాడులు చేయించిందని ఆయన ఆరోపించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో కేంద్రం స్పందించడంలేదని ఆయన అన్నారు. గుజరాత్ లాభం కోసం ఓఎన్జిసిని నష్టాల్లోకి నెట్టారనీ, ఎన్బిసిసి ఇండియాను దెబ్బతీశారనీ ఆయన విమర్శించారు. దేశంలో రాజకీయ నాయకత్వాన్ని అణచివేయాలని బిజెపి కుట్రలు చేస్తోందని ఆయన చెప్పారు. కేంద్రంపై పోరాటానికి అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సాగాలని ఆయన అన్నారు.
గత రెండేళ్ళుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు నెలలుగా బిల్లులు మంజూరు చేయడంలేదని ఆయన చెప్పారు. కేంద్రం నుండి పన్నురాయితీలకోసం ఎంపిలు డిమాండ్ చేయాలని ఆయన కోరారు.