అమరావతి: విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిబిఐ విచారణ జరిపిస్తే జగన్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాజధాని మార్పుపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. టిడిపి అయిదేళ్ల పాలన స్వర్ణయుగమనీ, వైసిపి ఏడు నెలల పాలన చెత్త పాలన అని దేవినేని ఉమా విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టులపై జగన్వి ఉత్తర కుమార ప్రగల్భాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే మాట ఏమో కానీ ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయని ఉమా అన్నారు. టిడిపి హయాంలో నదుల అనుసంధానం ద్వారా 62 ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి అసమర్థత, ముందు చూపు లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్లే ఈ ఏడాది వరద నీరు సముద్రం పాలయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేశారని ఉమా విమర్శించారు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారని అన్నారు. టిడిపి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాకూడదన్న కక్షతోనే పనులు నిలిపివేశారని ఉమా విమర్శించారు.