టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసిపిలోకి దూకేయ్యడానికి సిద్ధం అయిపోయారు. ఇది టీడీపీకి గానీ విశాఖ వాసులు గాని పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. గంటా రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్లు అందరూ ఇది ఎప్పుడో ఊహించే ఉంటారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో నియోజకవర్గాలతో నియోజకవర్గ ఓటర్ లతో, పార్టీలతో, పార్టీల సెంటిమెంట్ లతో, పార్టీ రంగులు, జెండాలతో ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఏ ఎన్నికలకు ఏ పార్టీలో ఉంటారో, ఎన్నికల తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారో ఆయనకే తెలియదు. కానీ మంత్రి అయిపోతారు. చక్రం తిప్పేస్తారు. పార్టీలో ఎదుగుతారు. వ్యూహకర్తగా మారుతారు. అన్నీ చెకాచేక చేసేస్తారు. అదే ఆయన ప్రత్యేకత. తాజాగా వైసీపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. దీనికి ఆ పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ముహూర్తం ఎప్పుడంటే..?
గంటా శ్రీనివాస రావు రాకకు వైసీపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలే ఉన్నాయి. సీఎం జగన్మోహన రెడ్డి అంగీకరించారు. అందుకే గంటా కూడా ఈ నెల 9 లేదా ఆగస్టు 16న వైసిపిలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి ఆగస్ట్ 15 వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత రాజధాని ఆరంభం సందర్బంగా తలపెడుతున్న ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గంటా వైసీపీలో చేరాలి అనుకున్నారు. కానీ ఈ మూడు రాజధానుల అంశానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేయడంతో ఇది ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అందుకే ఈ అంశంతో సంబంధం లేకుండా ఆగస్టు 16న వైసీపీకి మద్దతు ప్రకటించాలని గంటా నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీలు మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు (వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్, కరణం బలరాం) తరహాలోనే గంటా శ్రీనివాసరావు కూడా అధికారికంగా వైసీపీలో చేరరు. వైసీపీ కండువా కప్పుకోరు. జగన్ ను కలిసి మద్దతు ప్రకటిస్తారు అంతే. టిడిపి దూరం అవుతారు. కానీ గంటా కీలక అనుచరులు కొంత మంది మాజీలు మాత్రం వైసీపీ లో చేరిపోతారు. ఇది ప్రస్తుతం అనుకుంటున్న వ్యూహం. విశాఖను రాజధాని చేయడానికి జగన్ అంగీకరించడం, మూడు రాజధానుల అంశం తనకు బాగా నచ్చడం వైసీపీలో చేరడానికి కారణాలని గంటా పైకి చెప్తారు. లోపల మాత్రం ఆయన అవసరాలు, స్థానిక సందర్భాలు, ఆయన అవినీతి చరిత్రలు, పాత బాగోతాలు చాలానే ఉన్నాయి. అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే గంటా చేరికలో స్థానికంగా మాత్రం అనేక మెలికలు ఉన్నాయి.
విశాఖలో వ్యతిరేకత
గంటా చేరికకు విశాఖ వైసీపీ నాయకత్వం నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి అవంతి శ్రీనివాసరావు తాజాగా గంటా చేరికలు వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గంటా అవినీతి చరిత్రను కప్పిపుచ్చుకోవడానికి, జైలుకు వెళ్లకుండా ఉండడానికి అధికార పార్టీలోకి చేరుతున్నారని, ఆయన చేరిక వల్ల ఉపయోగం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే గంటా శ్రీనివాసరావు చేరికను మంత్రి అవంతి శ్రీనివాస్ ఏమాత్రం అంగీకరించడంలేదు. నిజానికి ఈ ఇద్దరు రాజకీయ సహచరులే. మొదటి నుండి ప్రజారాజ్యం పార్టీలో కలిసి పని చేశారు. ఆ తరువాత వారు తెలుగుదేశం పార్టీలను కలిసే పని చేశారు. కానీ 2019 ఎన్నికలకు ముందు గంటాకు అవంతి శ్రీనివాసరావు కు బాగా చెడి అవంతి వైసీపీలోకి దూకి మంత్రి అయ్యారు. గంటా టీడీపీలోనే ఉండిపోయి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు వైసీపీ లోకి వస్తున్నారు. గంటా చేరికను అవంతితో పాటు వైసీపీలో కీలక నాయకుడు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. గంట రాజకీయ చరిత్ర మొత్తం ఆయనకు తెలుసు. విశాఖలో గంట చేరికను వ్యతిరేకించడానికి కారణాలు కూడా ఉన్నాయి. విశాఖ రాజధాని కావడం, అక్కడ భూ కుంభకోణ గత వ్యవహారాల్లో గంటా ముద్ర కొంత ఉండటం, ఆయన అనుచరుల పాత్ర ఉండటం, గంట చరిత్ర బాగా తెలిసి ఉండటం ఇవన్నీ విజయసాయి రెడ్డి వ్యతిరేకించడానికి కారణాలుగా ఉన్నాయి. అందుకే నెల రోజుల కిందట విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో గంటా శ్రీనివాస రావు అయిదు కోట్లు అవినీతి చేశారని, ఈ అవినీతి బాగోతాన్ని ప్రభుత్వం త్వరలోనే బయట పెడుతుందని ట్వీట్ కూడా చేశారు. ఇలా వైసీపీలోకి గంటా చేరుదామనుకుంటే విశాఖలోనే కీలక నాయకుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం ఆయనకు కొంత తలనొప్పులు తెచ్చి పెడుతున్నప్పటికీ పార్టీ అధినేత, సీఎం జగన్ సానుకూలంగా ఉండటం కలిసి వచ్చే అంశమే. అందుకే దూకేయ్యడానికే నిర్ణయించుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?