అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన నవరత్న పథకాలు లబ్దిదారులకు అందిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. కానీ పలు నిర్మాణాలపై ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయించి వివాదాస్పదం చేస్తున్నాయి. ఈ పరిణామాలు జగన్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారట జగన్. ఈ క్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీని కోలుకోకుండా దెబ్బతీసేందుకు స్కెచ్ వేస్తున్నారనేది పొలిటికల్ వర్గాల్లో టాక్. టీడీపీని పూర్తిగా బలహీన పర్చేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చారట. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కొందరు నేతలు వైసీపీలో చేరారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీకి దగ్గర అయిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక ఎన్నికలు వాయిదా పడడం, కరోనా ఎఫెక్ట్ తదితర కారణాల వల్ల చేరికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆగిపోయిన ఈ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించుకున్న క్రమంలో టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ప్రధాన సామాజిక వర్గ కీలక నేతలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నాడని భావిస్తున్న యువ నాయకుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కిడారి శ్రావణ్ తండ్రి దివంగత సర్వేశ్వరావు 2014 ముందు వైసీపీ లోనే ఉన్నారు. 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సర్వేశ్వరావు ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో టీడీపీలో చేరారు. ఆ తర్వాత మావోయిస్టుల దాడిలో మరణించిన సంగతులు తెలిసిందే. సర్వేశ్వరావు హత్యతో చంద్రబాబు అయన కుమారుడు కిడారి శ్రావణ్ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే ఆయన ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేక పోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున శ్రావణ్ కుమార్ అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫ్యాన్ (వైసీపీ) గాలిలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయాడు శ్రావణ్ కుమార్. మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్నాడన్న కారణంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శ్రావణ్ కుమార్ కు ఏకంగా 16 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించారు. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఆయనకు కల్పిస్తున్న ఆ భద్రత 8 మందికి కుదించారు. ఆ తరువాత శ్రావణ్ భద్రతపై సమీక్ష చేసిన పోలీస్ ఉన్నతాధికారులు భద్రతను నాలుగుకి తగ్గించారు. తాజాగా పూర్తి భద్రతను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ పరిస్థితిలో టీడీపీ ఆయనను పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రావణ్ పార్టీ మారే ఆలోచన చేయడం, వైసీపీ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుని తండ్రి గూటికి చేరతారని అనుకుంటున్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కూడా వైసీపీ గూటిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?