అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వీరిద్దరూ మాజీ మంత్రులు. టీడీపీ సీనియర్ నాయకులు. అచ్చెన్నాయుడు అవినీతి కేసులో ప్రస్తుతం జైల్లో ఉండగా అయ్యన్నపాత్రుడు నిర్భయ కేసు ఎదుర్కొని కోర్టులో పోరాడుతున్నారు. ఇప్పుడు మరో మాజీ మంత్రిపై మరింత పెద్ద కేసు నమోదయింది. ఆయనను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత వారం వైసీపీ నేత మేకా భాస్కరరావు హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్యలో పలు కోణాల్లో శోధించిన పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అయితే తాజాగా బాధిత కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు మరో అనుమానితుడిగా మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును కూడా చేర్చారు. దీంతో పోలీసులు కొల్లు రవీంద్ర పైకూడా కేసు నమోదు చేశారు. ఈ రోజు రాత్రి లేదా రేపటి లోగా రవీంద్రను కూడా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని విషయం కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది కక్ష సాధింపే అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేరాలను ఎటువంటి పరిస్థితిలో ఉపేక్షించం అని వైసీపీ చెబుతోంది.
మొత్తానికి దేశం పార్టీ మాజీ మంత్రులలోనూ, కొంత మంది కీలక నాయకుల్లోనూ అరెస్ట్ భయం అయితే తొణికిసలాడుతోంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సారిగా మాజీ ప్రభుత్వ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇతర కేసుల విషయంలో అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు అయన జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత పలువురు టీడీపీ నాయకులు అరెస్ట్ లు అవుతూ బెయిలుపై బయటకు వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కీలక నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వడం, ఆ వెంటనే అయ్యన్న పాత్రుడు పై నిర్భయ కేసు మోపడం, తాజాగా కొల్లు రవీంద్ర పై హత్య కేసు నమోదు కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారు. ఇదే తరహాలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, లోకేష్ వీరందరూ కూడా అరెస్ట్ జాబితాలో ఉన్నారని వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అధికారాన్ని అనుభవిస్తూ అనేక తప్పులు చేశారు కాబట్టే ఇప్పుడు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని, ఖచ్చితంగా వీరంతా జైలుకు వెళ్తారు అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుండగా ప్రభుత్వం కక్ష సాధింపుగా లేనిపోని విషయాలు అన్ని బయటకు తీస్తూ అనవసర కేసులు మోపుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు అలర్ట్ అయి ముందస్తుగా న్యాయ సలహాలు తీసుకుంటూ తమపై ఏదైనా కేసు నమోదు అయితే అరెస్ట్ లు కాకుండా ఉండేందుకు కోర్టులను ఆశ్రయించే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఆరోపణలు, అరెస్టులు, అవినీతి కేసులతో రాష్ట్రంలో రాజకీయం ఒక రకంగా మలుపు తిరుగుతున్నట్లే.