అమరావతి: రాజధానిలో తన పేరుతో మూడు గజాల స్థలం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి రాజీమానా చేస్తారా అంటూ పత్తిపాటి సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు, మాజీ మంత్రులకు భూములు ఉన్నాయని రూట్ మ్యాప్తో సహా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై పత్తిపాటి మొదటి సారి స్పందించారు. ఎవరో సురేష్ తన బినామీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారనీ, ఆ 38 ఎకరాలు తనవని నిరూపిస్తే బుగ్గనకే రాసిస్తాననీ, లేకుంటే రాజీనామా చేస్తారా అంటూ బుగ్గనకు సవాల్ విసిరారు. పత్తిపాటి సవాల్పై బుగ్గన ఏ విధంగా స్పందించారో వేచి చూడాలి.
రాజధాని మార్చవద్దంటూ మందడంలో రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో పత్తిపాటి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంలో వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళనకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. రాజధానిని మార్చే హక్కు ఈ సిఎంకు ఎవరు ఇచ్చారని పుల్లారావు ప్రశ్నించారు.