(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసిపి ప్రభుత్వ పరిపాలనా తీరును తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు వైసిపి నేతలు సిగ్గుపడాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీతను తట్టుకోలేకే సిఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు. వైసిపి ప్రభుత్వ చర్యలన్నీ ప్రజా వ్యతిరేకమేనని రుజువు చేశామన్నారు.సాక్షిలో రాసినన్నీ తప్పుడు రాతలేనని జగన్ స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ దోపిడికి గేట్లు తెరిచారని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాలకు అప్రధాన పదవులు కేటాయిస్తూ సొంత సామాజిక వర్గానికి కీలక పదవులు ఇస్తున్నారనీ అన్నారు. 300 లకు పైగా పదవులు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారని జివోల ద్వారా వెల్లడవుతోందని అన్నారు. 50శాతం పదవులు బడుగులకే అని చెప్పిన జగన్ నినాదం వంచనేనని దుయ్యబట్టారు.చివరకు సామాజిక న్యాయంలోనూ జగన్ నయవంచనకు పాల్పడుతున్నారని యనమల విమర్శించారు. అత్యాచారాలకు పాల్పడిన సొంత సామాజికవర్గం వాళ్లపై చర్యలు లేవా అని ఆయన ప్రశ్నించారు. దిశ బిల్లు తెచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యాచారాలు జరగడం సిగ్గు చేటని అన్నారు. మీడియాకు కళ్లెం వేసే జివో 2430ని తక్షణమే రద్దు చేయాలని యనమల డిమాండ్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?