రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం (టీడీపీ) పార్టీ నిర్వీర్యమవుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచినప్పటికీ కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో టీడీపీలోని హేమాహేమీలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఎస్ఎస్ పార్టీలో చేరిపోయారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారిని కేసిఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది టీడీపీ. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ చావుదెబ్బతిన్నది. సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడ్, అశ్వరావుపేట ఎస్టీ రిజర్వుడ్ స్థానాలను మాత్రమే టీడీపీ గెలుచుకున్నది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇక ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీకి క్యాడర్ ఉన్నప్పటికీ నేతలు పార్టీ మారిపోయారు. నియోజకవర్గ స్థాయి నేతలు లేకపోవడంతో పార్టీ క్యాడర్ కూడా తమకు నచ్చిన పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ బలం పూర్తిగా తగ్గిపోయింది.
రాబోయే ఎన్నికల్లో 15 స్థానాల్లో అయినా గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది టీడీపీ. ఇందు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఒక యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నారుట. ఈ క్రమంలోనే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు పార్టీ బాధ్యతలను అప్పగించారు. గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను గుర్తించి ఆ నియోజకవర్గాల్లో గ్రామ, మండల స్థాయిలో క్యాడర్ పునః నిర్మాణం చేసే పనిలో నిమగ్నమైయ్యారు. నాయకత్వ సమస్య ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుండి నాయకులను చేర్చుకోవడం, గతంలో పార్టీ నుండి బయటకు వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? అనేదానిపై పార్టీ అంతర్గత సర్వే చేయించిందట. 2018 ఎన్నికల నాటి పరిస్థితే ఉన్నాదా..? పార్టీ ఓటు బ్యాంక్ పరిస్థితి ఏమిటి..? అనే విషయాలను వారు పరిశీలించగా..సుమారుగా పది శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ ఆ మేరకు 13 – 14 స్థానాలు గెలిచే పరిస్థితి లేదని వెల్లడైందట.
అయితే తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలిసిందట. వీటిలో సికింద్రాబాద్, సనత్ నగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి. మలక్ పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయట. ఈ నియోజకవర్గాల్లో సరైన అభ్యర్ధులను బరిలో దింపి పోల్ మేనేజ్ మెంట్ చేయగలిగితే గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారుట. అయితే ఈ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది. 2018 ఎన్నికలో ఓడి పోయిన తర్వాత టీడీపీ నేతలు పూర్తిగా కాడిపడేశారు. కార్యకర్తలను పట్టించుకోలేదు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకే పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్న ఈ తొమ్మిది నియోజకవర్గాలపైనే టీడీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..!!
అసెంబ్లీలో కేసిఆర్ మాటల వెనుక వ్యూహం అదేనని పేర్కొన్న ఈటల రాజేందర్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?