టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. 2019 ఎన్నికల ఓటమి అనంతరం పార్టీలో రాజీనామాలు ఎక్కువయ్యాయి. ఓడిపోయిన వారే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా టీడీపీని వీడుతున్నారు. ఇందుకు పార్టీ విధానాలు ఒక కారణమైతే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఒక కారణం. విశాఖ జిల్లాలో కీలక నేతగా ఉన్న పంచకర్ల రమేశ్ బాబు టీడీపీకి గతంలోనే షాక్ ఇచ్చారు. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. టీడీపీకి విశాఖలో కీలకంగా వ్యవహరించిన రమేశ్ ఇప్పుడు వైసీపీకి బలం కాబోతున్నారు.
ప్రజారాజ్యం టు వైసీపీ.. వయా టీడీపీ
పంచకర్ల రమేశ్ బాబు 2009లో రాజకీయ తెరంగేట్రం చేశారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్తిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆ పార్టీలోనే ఉన్నారు. తర్వాత 2014లో గంటా, అవంతి శ్రీనివాస్ తో కలిసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కూడా యలమంచిలి నుంచి పోటీ చేసిన రమేశ్ బాబు వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ విధానాలు, ఎన్నికల్లో విశాఖ రూరల్ లో టీడీపీ గెలవకపోవడం, పార్టీ ప్రజాదరణ కోల్పోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. మరే పార్టీలోనే చేరని రమేశ్ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
విశాఖపై టీడీపీ అనుసరిస్తున్న ధోరణే కారణమా..
సీఎం జగన్ నిర్ణయించి మూడు రాజధానుల అంశంలో టీడీపీ పోకడ కూడా పంచకర్ల రమేశ్ బాబు రాజీనామాకు కారణమని తెలుస్తోంది. విశాఖ రాజధాని అంశంలో అక్కడి ప్రజల అభిప్రాయం మేరకు కూడా రమేశ్ తన అడుగులు వేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఉంచాలని నినదిస్తున్నారు. టీడీపీ వాదన విశాఖ జిల్లాపైనే కాకుండా ఉత్తరాంధ్రపై వ్యతిరేక ధోరణికి నిదర్శనంగా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పంచకర్ల రమేశ్ బాబుకు వైసీపీలో చేరడమే సముచిత నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అవంతి టీడీపీని వీడి వైసీపీలో గెలిచి మంత్రి కూడా అయ్యారు. గంటా త్వరలోనే టీడీపీ వీడనున్నారనే వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా విశాఖలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?