టీడీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి..! విశాఖ జిల్లా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని వీడిన కొద్దీ రోజుల్లోనే గంటా కూడా చేరనున్నారు…! ఎమ్మెల్యేల సంఖ్యా తగ్గుతూ వస్తుంది. ఇక మాజీలు, కీలక నేతలు కూడా పార్టీకి దూరమవ్వడం చంద్రబాబుకి షాకులే. తాజాగా గల్లా అరుణ టీడీపీకి రాజీనామా చేయలేదు.., కానీ పార్టీ పొలిట్ బ్యూరోకి రాజీనామా చేసారు. అంటే బాబుకి పది అడుగులు దూరం అయినట్టే. టీడీపీకి కాస్త ఎడబాటు పెంచినట్టే. అసలు ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి అసలు కారణాలు పెద్దవిగానే ఉన్నాయి..!!
వాళ్ళది దశాబ్దాల స్నేహం..!
గల్లా కుటుంబానికి, చంద్రబాబుకి స్నేహం ఇప్పటిది కాదు. దశాబ్దాల నుండి ఉంది. గల్లా అరుణ కుమారి తండ్రి గల్లా రాజగోపాలనాయుడు అంటే చిత్తూరు జిల్లాలో ఓ పెద్ద బ్రాండ్. చిత్తూరు ఎంపీగా రెండు సార్లు గెలిచారు. ఓ సారి ఎమ్మెల్యేగా, ఓ సారి ఎమ్మెల్సీగా పని చేసారు. ఆయన వద్ద చంద్రబాబు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుంది. గళ్ళ కుటుంబానికి అది 1970 వ దశకం నుండి సొంత స్థానమే. అక్కడే చంద్రబాబు గళ్ళ కుటుంబంలో సభ్యుడిగా చేరి, రాజగోపాలనాయుడుతో తిరిగారు. ఆయన జెండా మోసి, పనిచేసారు. ఈ క్రమంలోనే అరుణ కుమారితో అప్పటి నుండి బాబుకి పరిచయం ఉంది. తండ్రి వారసులవారీగా గల్లా అరుణ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు.
2019 సీటు విషయంలో కినుక..!!
2014 ఎన్నికలకు ముందు గల్లా అరుణ టీడీపీలో చేరారు. 2014 లో చంద్రగిరి సీటు ఆమెకే కేటాయించగా ఓడిపోయారు. కానీ ఇంఛార్జిగా అధికారంలో ఉంటూ శాసించారు. ఆమె కుమారుడు జయదేవ్ మాత్రం గుంటూరు ఎంపీగా, పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అరుణకు సీటు ఇవ్వలేదు. ఆమెకు కాదని పులవర్తి నానికి కేటాయించారు. నిజానికి ఆమె మొదట పోటీ చేయను అన్నారు, ఆ తర్వాత మనసు మార్చుకు పోటీకి సిద్ధమయ్యే సమయానికి బాబు నానికి ఖరారు చేశారు. అక్కడితో బాబుకి, అరుణకు మధ్య దూరం పెరిగింది. దీనికి ఆజ్యం పోస్తూ ఇటీవల పార్లమెంటు అధ్యక్షులను నియమించారు. దీనిలో చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిగా పులవర్తి నానికి ఇచ్చారు. ఇక్కడ కూడా అరుణకు అవమానం జరిగినట్టు ఆమె నొచ్చుకున్నారు. ఆమెని సంప్రదించకుండా బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె పొలిట్ బ్యూరో నుండి తప్పుకున్నారు.
త్వరలో పార్టీకి షాక్..!!
పొలిట్ బ్యూరో నుండి తప్పుకుని అక్కడితో ఆగుతార..? పార్టీకి కూడా దూరమవుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. కొన్ని రోజులుగా గల్లా జయదేవ్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్ గా లేరు. కాకపోతే బీజేపీపై మాత్రం పార్లమెంటులో గళం విప్పారు. కానీ… ఆయన బీజేపీలో చేరనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నా చర్చ..? జయదేవ్ పై ఇలా పుకార్లు వస్తుండడం.. ఆయన తల్లి టీడీపీపై అలక వహించడం.., ఇవన్నీ టీడీపీకి, చంద్రబాబుకి ఒకరకంగా చేదు సంకేతాలే. వీటిని సర్డుకుకుంటారా..? పెంచుకుంటారా..? అనేది కొద్దీ రోజుల్లో స్పష్టత రానుంది.