TDP Hopes: ఏపీ అంటే కుల రొచ్చు.. కులాల కంపు.. రాజకీయం మొత్తం కులాల మధ్య నలిగిపోయిన నేతలే ఉన్నారు.. మహానుభావుడు అని చెప్పుకునే ఎన్టీఆర్ కులం కోసమే పార్టీ పెడితే.., మహానేత అని పిలుచుకునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఓ కులానికి పెద్ద నేతగా మారారు.. వారి పార్టీల వారసులు ప్రస్తుతం అదే కొనసాగిస్తున్నారు.. అయితే.. ఇప్పుడు టీడీపీ ఒక కొత్త లెక్క, లాజిక్కు తెరమీదకు తెస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఓ అంతర్గత అంశం హాట్ టాపిక్ గా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల కోసం ప్రణాళిక కూడా ఈ అంశంపై అధారపడి ఉంది. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజకీయంగా అత్యంత బలంగా ఉన్నది రాయలసీమ ప్రాంతం. వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్లు దాదాపు 35 నుండి 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసిస్తుంటారు. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాయలసీమలో వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత సామాజికవర్గం కొంత వ్యతిరేకంగా మారుతోందన్న సంకేతాలు కనబడుతున్నాయి. మొత్తం అందరూ కాకపోయినా 20 నుండి 25 శాతం మేరకు రెడ్డి సామాజికవర్గం వైసీపీపై అసంతృప్తిగా ఉన్నట్లుగా టీడీపీ లెక్కలు వేసుకుంటుంది.. జగన్మోహనరెడ్డిపై పెట్టుకున్న ఆశల మేరకు పని చేయడం లేదనీ, పనులు జరగడం లేదనీ, వైఎస్ఆర్ మాదిరిగా రాజకీయాలు చేయడం లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట. వీళ్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏమిటంటే..
TDP Hopes: కాంగ్రెస్ మాజీలందరూ కలిసి..!
ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి (ఈయన యాదవ సామాజికవర్గం)ని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి కలిశారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కొంత అంతర్గత సమాచారాన్ని ఆయన సేకరించారు. రఘువీరారెడ్డికి సన్నిహితంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న రెడ్డి సామాజికవర్గ నేతలతో ఎలా మాట్లాడాలి..? ఎలా వ్యవహరించాలి..? ఎలా సంప్రదించాలి..!? అనే అంశాలపై చర్చించారు. అదే విధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గత నెలలో టీడీపీ కార్యాలయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో రెడ్డి సామాజికవర్గం వైసీపీపై అసమ్మతితో ఉంది. ఆ వర్గం టీడీపీ వైపు ఆకర్షితం అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ మంత్రి జేసి దివాకరరెడ్డి రాయలసీమ ప్రాంత సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డిని కలిశారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రాయలసీమలో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని ఐక్యం చేసే పనిలో టీడీపీ ఉన్నట్లు కనబడుతోంది. కొంత మంది టీడీపీ నాయకులు ఈ ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి ప్రయత్నాలు చేస్తుండగా, వీరికి తెరవెనుక కొందరు (మాజీ మంత్రులు) సహకారం అందిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. రాయలసీమలో వైసీపీకి కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందని గ్రహించిన టీడీపీ.. ఆ వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే పనిలో ఉంది. అయితే ఇది అంత సులువు కాదు..
జగన్ నే తిప్పుకుంటారేమో..!?
వాస్తవానికి రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. ఆ తరువాత ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి డైవర్ట్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో 50- 50 బలం ఉండేది. అనంతపురం జిల్లాలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. కానీ 2019 ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే హిందూపూర్, ఉరవకొండ నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం మొత్తం వైసీపీకి అనుకూలంగా మారినట్లు జేసి దివాకరరెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ కారణంగా కడప, కర్నూలు జిల్లాల్లో మొత్తం వైసీపీనే గెలిచింది. అదే విధంగా చిత్తూరులో కుప్పం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. గడచిన ఎన్నికల్లో రాయలసీమలో కేవలం టీడీపీ మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా, రాబోయే 2024 ఎన్నికల్లో కనీసం 20 – 22 గెలవాలనేది టీడీపీ ప్లానింగ్ గా కనబడుతోంది. అందుకు కొన్ని తెరవెనుక ప్రయత్నాలు, తెర ముందు ప్రయత్నాలను టీడీపీ చేస్తోందట. ఈ మొత్తం బాధ్యతలను జేసి బ్రదర్స్ తీసుకోగా ఆయనకు తోడుగా కోట్ల సూర్యప్రకాశరెడ్డి కలిశారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. వీళ్ల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
* వాస్తవానికైతే కడప, కర్నూలు జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం జగన్మోహనరెడ్డిని కాదని బయటకు వచ్చే పరిస్థితి ఉండదు అన్న మాట కూడా వినబడుతోంది. జగన్ తోనే మాట్లాడుకుని.. మార్చుకునే ప్రయత్నం చేస్తారు తప్ప టీడీపీ లాంటి పార్టీలవైపు చూసే అవకాశమే లేదు. కాకపోతే జగన్ మరీ మాట వినకపోతే.., తమకు స్వేచ్ఛ, స్వతంత్రత ఇవ్వకపోతే.. పనులు జరగనీయకపోతే మాత్రం ఆలోచిస్తారేమో..!?