TDP Internal News: 2019 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితికి టీడీపీ వెళ్ళిపోయింది.. ఆ అయిదేళ్ల పాలనలో చేసిన అవినీతి పుణ్యమో.., కొన్ని వర్గాలకు చేసిన అన్యాయం ఫలితమో.. జన్మభూమి కమిటీల అరాచకాల ప్రభావమో.. జనసేన పార్టీ చీలిక దుర్భాగ్యమో.. మొత్తానికి టీడీపీ ఆ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమయింది..! ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తాయి అనుకుని దారుణంగా దెబ్బతిన్న నియోజకవర్గాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. టీడీపీకి పునాదులు బలంగా ఉన్నాయి.. పూర్వ వైభవం ఘనంగా ఉంది.. సరైన అభ్యర్ధులు ఉన్నారు.. కార్యకర్తల బలం ఉంది అయినప్పటికీ చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయింది టీడీపీ. వాటిల్లో గుంటూరు జిల్లాలో నర్సరావుపేట నియోజకవర్గం ఒకటి. ఇది దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సొంత నియోజకవర్గం. వరుసగా ఆయన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి ఇవ్వగా బీజేపి అభ్యర్ధి ఓడిపోయారు. వైసీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అనుకుని బీసీ కోటాలో భాగంగా చదలవాడ అరవింద్ బాబుకు టీడీపీ సీటు ఇచ్చింది. ఈయన కూడా ఓడిపోవడంతో గోపిరెడ్డి వరుసగా రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పునాదులు ఉన్నాయి. పార్టీ ఏర్పాటు నుండి ఆరు సార్లు టీడీపీ గెలిచింది. అటువంటి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవడం ఏమిటి..? ఇప్పుడు ఎవరికి సీటు ఇస్తే బాగుంటుంది..? అని కొత్తగా అభ్యర్ధుల వేటలో పడింది. ఈ క్రమంలోనే అక్కడ బీసీ వర్గానికి చెందిన డాక్టర్ అరవింద్ బాబుకి కాదని.., కమ్మని కొత్తవారికి ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట..!
TDP Internal News: గోపిరెడ్డికి మంచి పేరే కానీ..!?
అటు వైసీపీలో మంచి మెజార్టీతో గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మంచి పేరు ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. అన్ని మండలాల్లో, గ్రామాల్లో పరిచయాలు ఉన్నాయి. పూర్వపు టీడీపీ సీటు.., ప్రస్తుతం వైసీపీకి, ఆయనకు కంచుకోటగా మారుతుంది అనుకుంటున్న తరుణంలో ఆయన అనుచరుల కారణంగా, కొంత మంది నాయకుల కారణంగా పార్టీకి కొంత చెడ్డపేరు వస్తోందని సమాచారం. కొన్ని అవినీతి ఆరోపణలు, ఇతర వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్న కారణంగా పార్టీకి కొంత నష్టం జరిగిందని అంటున్నారు. వైసీపీ సంఫంగతి పక్కన పెట్టి.. ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమిటి..? ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు..? అనేదానిపై క్లారిటీ లేదు. చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇస్తారో లేదో చెప్పలేని పరిస్థితి ఉందట..! నిజానికి ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక అధిపత్యం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం 27 వేల ఓట్లు ఉంటే రెడ్డి సామాజికవర్గం ఓట్లు 25 వేల వరకూ ఉన్నాయి. కాపు సామాజికవర్గం సుమారుగా 12 వేల ఓట్లు ఉంటాయి. ఎస్సీ సామాజికవర్గ ఓట్లు 30వేల ఓట్లు, ముస్లిం మైనార్టీ ఓట్లు 15 వేలు, బీసి సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా 50 వేలకు పైగా ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం వచ్చేసరికి కమ్మ, రెడ్డి మధ్యనే ఉంటుంది.
TDP Internal News: అరవింద్ బాబుకి ఎసరు..!? ఆ కమ్మాయనకి సీటు..!?
ఇక్కడ అరవింద్ బాబుకు బీసీ కోటాలో సీటు ఇచ్చినా గెలవలేదు. ఆయనకు మంచిపేరు ఉంది. ఆ ప్రాంతంలో వైద్యుడుగా సుపరిచితుడు. ఆర్ధికంగానూ స్థితిమంతుడే. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. మరి ఎవరికి ఇస్తారు..? అంటే కొత్తగా రెండు పేర్లు వినబడుతున్నాయి. రావుల సత్యనారాయణ పేరు ఒకటి వినబడుతోంది. ఈయన తిరుమల డైయిరీ మాజీ చైర్మన్. ఈయనకు పోటీ చేయాలన్న ఆలోచన ఉంది. అందుకు పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. టీడీ జనార్థన్ తదితర పార్టీ పెద్దలతో టచ్ లో ఉండి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పేరు కడియాల వెంకటేశ్వరరావు. ఈయన కూడా టీడీపీలో కీలక నాయకుడు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు బంధువు అవుతారు. మరో పక్క నగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుకుడికి తోడల్లుడు అవుతారు.. అటు గొట్టిపాటి, ఇటు గాలి బంధుత్వం కారణంగా కడియాల కీలకంగా ఉన్నారు. ఇప్పుడు రావుల సత్యనారాయణకు ఇస్తారా..? లేక కడియాల వెంకటేశ్వరరావుకు ఇస్తారా..? అనేది పెద్ద ప్రశ్న. వీరి ఇద్దరిలో ఎవరికి సీటు ఇచ్చినా చదలవాడ అరవింద్ బాబు సహకరించే అవకాశం లేదు. ఆయన వర్గం అంత సీరియస్ గా ఉంది. అయితే అరవింద్ బాబుకు వేరే సీటు గానీ లేక ఎమ్మెల్సీ గానీ ఇచ్చి వీళ్లిద్దరిలో ఒకరికి ఎవరో ఒకరికి సీటు ఇవ్వాలి.
కోడెల కుమారుడికి రాం రామ్..!
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. 2014 నుండి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గంలో సాధ్యమైనంత ఎక్కువగా పార్టీని డ్యామేజ్ చేసిన కోడెల శివరామ్ కూడా అటు సత్తెనపల్లి గానీ లేక నర్సరావుపేట గానీ అడుగుతున్నారు. ఆయనకు సీటు ఇస్తే మాత్రం కార్యకర్తలు తాము పని చేయమని స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు కేటాయిస్తే తాము ఇళ్ల నుండి బయటకు రామని కూడా కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు. గతంలో ఆయన చేసిన పనుల కారణంగా కోడెలకు ఎక్కడా సీటు ఇచ్చే అవకాశం అయితే కనబడటం లేదు. ఇదిలా ఉంటే రెండున్నర సంవత్సరాల్లో వైసీపీకి జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా సేఫ్ జోన్ అయ్యేందుకు కొంత మంది నాయకులను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరో సారి గెలవాలి అంటే ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుని వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కొత్త రాజకీయం చూపించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?