TDP : 39 ఏళ్ళ చరిత్ర.. ఇరవై ఏళ్ల అధికారం.. పంతొమ్మిదేళ్ళ ప్రతిపక్షం.. రాష్ట్ర చరిత్రలో చెరిగిపోని రాజకీయ పార్టీ.. మొదటిసారి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. స్థానిక పాలనలో కీలకమైన పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. అందుకు కారణాలు ఏవైనా చెప్పనీ.. ఎన్నైనా ఉండనీ.. కానీ ఈ నిర్ణయం మాత్రం చరిత్రాత్మకమే. లోతుగా ఆలోచించాల్సిన అంశమే. ఆ పార్టీ, ఆ పార్టీ ప్రత్యర్ధులు, రాజకీయులు సైతం దీన్ని అధ్యయనం చేయాల్సిన అంశమే. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరిస్తే ప్రభుత్వానికి నైతికంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ నిర్ణయం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది..!? ఈ నిర్ణయం వెనుక పనిచేసిన ప్లానింగ్ ఏమిటి అనేది చూద్దాం..!
TDP : బహిష్కరణ కారణాలు – లోతుగా..!!
పరిషత్ ఎన్నికలను బహిష్కరించడానికి టీడీపీ చాలా కారణాలు పైకి చెప్పుకుంటుంది. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలను సాకులుగా చూపించారు. వాటిలో కొన్ని వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. సుప్రీం తీర్పుని, మార్గదర్శకాలను కాదని నోటిఫికేషన్ ఇవ్వడం… తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నా సమయంలో… వారం రోజుల్లోనే పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా నోటిఫికేషన్ ఇవ్వడం.. అధికార బలాన్ని ఉపయోగించి.. టీడీపీని ఇబ్బంది పెట్టి… ఎన్నికల కమీషన్ ఏకపక్ష నిర్ణయాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అనుకోవడం… ఇవన్నీ సమంజసం కాదు అనేది టీడీపీ అభిప్రాయం. ఇవన్నీ బయటకు చెప్తున్న కారణాలు. కానీ..
* నిజానికి టీడీపీ ఈ ఎన్నికలకు సిద్ధంగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఏం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసినా వచ్చే ప్రయోజనం, సానుకూల ఫలితం పెద్దగా ఉండదు. మహా అయితే 20 శాతం స్థానాలు వస్తే రావచ్చు.. అంతకు మించి రావు..!
* ఈ 20 శాతం స్థానాల కోసం టీడీపీ కార్యకర్తలు శ్రమించాలి. కొట్లాడాలి, కేసుల్లో దూరాలి.., అధికార పార్టీతో పోరాడాలి. డబ్బులు ఖర్చు చేయాలి. ఎంత తక్కువ లెక్కేసినా కనీసం ఒక్కో నియోజకవర్గానికి రూ. 70 లక్షలు ఖర్చు ఖాయం. అంటే రూ. 200 కోట్లకు పైగా టీడీపీ ఖర్చు చేయాల్సిందే. ఇంత చేసినా గెలిచేవి తక్కువ… గెలిచాక వాళ్ళు పార్టీలో ఉంటారో.., లేదో అనుమానమే..!
* ఇన్ని ప్రాక్టీకల్ నిజాలు, సవాళ్లు ముందున్నప్పుడు ఆ పార్టీ పోటీ చేయడం కంటే… కొన్ని లాజికల్, ఎథికల్ కారణాలు చూపించి తప్పుకోవడమే మేలు అని పార్టీ పెద్దలు భావించారు. అదే విషయాన్నీ చంద్రబాబు ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పేసారు. సో.. ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకోవడం ద్వారా టీడీపీ కొన్ని విషయాల్లో సేఫ్.
బహిష్కరణతో ఏం సాధిస్తారు..!?
ఇప్పుడు ఈ ఎన్నికలను బహిష్కరించడం ద్వారా పార్టీ కోల్పోయేది ఏమి ఉండదు. కార్యకర్తలకు ఎలాగోలా చెప్పుకోవచ్చు. పార్టీలో దిగువ స్థాయి నుండి, ఉన్నత స్థాయి వరకు 80 శాతానికి పైగా నాయకులు ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి మద్దతు పలికారు. సో… ఈ నిర్ణయంతో పార్టీలో అంతర్గతంగా ఏమి చిక్కులు ఉండవు. ఇక ప్రజలకు చెప్పుకోవడం.., కోర్టుల్లో పోరాడడమే ఆ పార్టీ ముందున్న లక్ష్యాలు. బహిష్కరణ ద్వారా వైసీపీని దోషిగా నిలబెట్టాలని.. నైతికత దెబ్బతీయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకరకమైన సానుభూతి వచ్చేలా చూసుకుని.. మమ్మల్ని అధికార పార్టీ వేధిస్తుంది.. అడ్డగోలుగా వెళ్తుంది.. రాజ్యాంగ బద్ధంగా లేదు.. అందుకే పోటీ చేయడం లేదు అని చెప్పుకుని… టీడీపీ జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా వైసిపి గెలిచినా.. అది మేమిచ్చిన గెలుపే అని బిల్డప్ ఇచ్చుకోవచ్చు. పోటీ చేసి ఓడిపోయే కంటే.. పోటీ చేయకుండా ఉంటే కప్పిపుచ్చుకోవచ్చు… ఇలా పార్టీ డబ్బు మిగుల్చుకోవడం.., అధికార పార్టీని దోషిగా చూపడం.., సానుభూతి పెంచుకోవడం.. అనే కొన్ని అంతర్గత లక్ష్యాలతో టీడీపీ ఈ నిర్ణయాలు తీసుకుంది..!!