అమరావతి: చంద్రబాబు హయాంలో ఏడాదికి 22 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్ అయిదు నెలల పాలనలోనే 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అంతే కాకుండా బడ్జెట్లో 48 వేల కోట్ల రూపాయలు అప్పు ప్రతిపాదించారని బుద్దా విమర్శించారు.
ఎవరు ఎక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారో ఇప్పుడు చెప్పండి లెక్కల మాస్టారూ అంటూ విజయసాయిరెడ్డిని నిలదీశారు.
సిఎం జగన్, వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలను బుద్దా ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
‘చంద్రబాబు తలపెట్టిన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుని వంకర రోడ్డుగా మార్చింది మీ మహానేతే విజయసాయి గారూ. ఆపై మహానేత, యువనేత కలిసి తమ మందీమార్బలంతో ప్రాజెక్టు వ్యయాన్ని 5500 కోట్ల రూపాయల నుంచి 35 వేల కోట్ల రూపాయలకు పెంచి ఆస్తులు కూడబెట్టింది నిజం కాదా?’ అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.