(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని కోసం 33000 ఎకరాలు ఇచ్చిన రైతులు 33 రోజుల పాటు ఇలా రోడ్లపై కూర్చుని ఆందోళనలు నిర్వహించడం తానెక్కడా చూడలేదని అన్నారు. రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ రాజధాని ప్రాంత గ్రామాల్లో సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. దీనిపై రాజకుమారి మాట్లాడుతూ పోలీసులు అందరూ ఒకేలా ఉండరనీ, వారికి సహాయ నిరాకరణ అనేది తప్పునీ అన్నారు. రైతులు,మహిళలు మానవత్వంతో వారికి సహకరించాలని సూచించారు. అధికారుల ఆదేశాలు మాత్రమే వారు పాటిస్తారని చెప్పారు. పోలీసులకు త్రాగు నీరు,ఆహార పదార్థాలు ఇవ్వాలని సూచించారు.
ఈ దరిద్రపు ప్రభుత్వం వల్ల తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానన్నారు. మరో రెండేళ్లు పాటు పదవీకాలం ఉన్నా తప్పుకున్నట్లు రాజకుమారి తెలిపారు.రాజధాని ప్రాంత మహిళలను చూస్తుంటే తన గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పోలీసులు ఇలా ప్రర్తించడం గర్హనీయమన్నారు.
శాసనసభలో వైసిపి బలంతో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం లభించినా కౌన్సిల్లో టిడిపి బలంగా ఉందనీ, మండలిలో బిల్లు ఆమోదం పొందదని అన్నారు. ప్రస్తుతం వికేంద్రీకరణ బిల్లు అమలు అవ్వదని చెప్పారు. మరో మూడు నెలలు సమయం పడుతుందన్నారు.
న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరంగా పోరాడి అమరావతి సాధించుకుందామని అన్నారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులు, మహిళలను రాజకుమారి అభినందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?