విజయవాడ: సీఎం వైఎస్ జగన్కి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి బినామీ అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన లక్షా 75 వేల ఎకరాలకు ద్వారంపూడి కూడా బినామీగా ఉన్నారని చెప్పారు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబ దందాలకు అంతేలేదని, ద్వారంపూడి తండ్రి అనపర్తిలో దొంగనోట్లు ముద్రించి చెలామణీ చేసేవాడని ఆరోపించారు. ‘రేషన్ బియ్యాన్ని అక్రమంగా షిప్పుల్లో విదేశాలకు తరలించిన చరిత్ర మీది’ అని పంచుమర్తి విమర్శించారు. పలువురు ఉపాధ్యాయులను కిడ్నాప్ చేసి బలవంతంగా వారి ఆస్తిని కొట్టేశారని దుయ్యబట్టారు. కాకినాడలోని భాస్కర బిల్డింగ్ కాంప్లెక్స్ ద్వారంపూడి పేకాట క్లబ్ ఉందన్నారు. పేకాట క్లబ్లో గతంలో ఓ మంత్రిని గన్తో ద్వారంపూడి బెదిరించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ద్వారంపూడికి లేదన్నారు.
2004 నుంచి పలు సెక్షన్ ల కింద ద్వారంపూడిపై దందా కేసులున్నాయని పేర్కొన్నారు. ద్వారంపూడి చెంచాగాళ్లు కాకినాడలో చేయని దౌర్జన్యాలు లేవని మండిపడ్డారు. దొంగ ముఖ్యమంత్రి కాబట్టే దొంగైన ద్వారంపూడికి టికెట్ ఇచ్చారని విమర్శించారు. ద్వారంపూడి నోటిని అదుపులో పెట్టుకోకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించారు. హైపవర్ కమిటీ మీటింగ్ పేరుతో కోర్టుకు వెళ్లకుండా జగన్ డ్రామాలాడుతున్నారని పంచుమర్తి ఆరోపించారు.