అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఎంపీ కేశినేని నాని, దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్ తదితరులు ఎన్టీఆర్కు అంజలి ఘటించారు. తన తాతగారి 24వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించినట్టు టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అనంతరం కార్యాలయంలో చంద్రబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఆ మహనీయుడి ఆశయసాధనే లక్ష్యంగా పనిచేస్తామని లోకేశ్ పేర్కొన్నారు.
తాత గారి 24వ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించాము. అనంతరం రక్తదాన శిబిరాన్ని అధినేత చంద్రబాబు గారు ప్రారంభించారు. ఆ మహనీయుడి ఆశయసాధనే లక్ష్యంగా పనిచేస్తాం. #NTRDeathAnniversary pic.twitter.com/QHKjSrK0oW
— Lokesh Nara (@naralokesh) January 18, 2020
'ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం' అంటూ రాజకీయాల్లోకి సేవాభావాన్ని తెచ్చిన ప్రజానాయకుడు.. బడుగు బలహీనవర్గాల పెన్నిధి.. మా తాతగారు ఎన్టీఆర్. క్రమశిక్షణకు, విలువలకు మారుపేరైన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ప్రతిపేదకూ అండగా నిలిచేందుకు పునరంకితమవుదాం.
— Lokesh Nara (@naralokesh) January 18, 2020
‘’ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం’ అంటూ రాజకీయాల్లోకి సేవాభావాన్ని తెచ్చిన ప్రజానాయకుడు.. బడుగు బలహీనవర్గాల పెన్నిధి.. మా తాతగారు ఎన్టీఆర్. క్రమశిక్షణకు, విలువలకు మారుపేరైన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ప్రతిపేదకూ అండగా నిలిచేందుకు పునరంకితమవుదాం’ అని లోకేశ్ ట్విట్ చేశారు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని నలుమూలలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని తెలిపారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందించడం, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం వంటివి ఒక్క ఎన్టీఆర్కే చెల్లిందని ఎంపీ పేర్కొన్నారు. సినిమాలో పోషించిన పాత్రల ప్రభావంతోనే ప్రజలకు సేవ చేయాలని ఎన్టీఆర్కు భావన కలిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.