బీజేపీ జోరుమీదుంది. బీహార్ లో గెలిచేసింది. కష్టమనుకున్న దుబ్బాకలో గెలిచేసింది. పాతిక సీట్లు గెలిస్తే బాగా ఎక్కువ అనుకున్న గ్రేటర్ లో 48 స్థానాలు కొట్టేసింది. అలా అలా.. తెలంగాణాలో 2023 లో సీఎం కుర్చీకి కర్చీఫ్ వేసుకుంది. ఇదీ ఊపులో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ కానీ కొట్టేస్తే ఇక టీఆరెస్ మూడేళ్ళలో ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధం కావాల్సిందే. సరే.. తెలంగాణాలో బీజేపీ సంగతి పక్కన పెడితే.. ఏపీలో బీజేపీ విషయానికి వద్దాం..!
ఏపీలో 2024 లక్ష్యం ఎందుకంటే..!?
దేశం మొత్తం మీద బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఏపీ మాత్రమే. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో కష్టహ బీజేపీ ఉనికి ఉంది, క్షేత్ర బలం, బలగం ఉంది. కానీ ఏపీలో ఆ పార్టీకి నయాపైసాకీ పనికి రాదూ. కానీ ఇప్పుడు బీజేపీ పంథా మార్చింది. తెలంగాణాలో 2023 నాటికీ సీఎం కుర్చీపై కన్నేసినట్టే.. ఏపీలో 2024 నాటికి కింగ్ మేకర్ అవ్వాలని చూస్తుంది. లేదా ప్రధాన ప్రతిపక్షం అవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. నిజానికి అది పగటి కలే. కానీ బీజేపీ రాజకీయ స్ట్రాటజీ, ఆ పార్టీ ధైర్యం, కాన్ఫిడెన్స్, పోల్ మేనేజ్మెంట్ ప్రత్యర్థులకు అంతుపట్టడం లేదు. కాకలు తిరిగిన కేసీఆర్ కి చుక్కలు చూపిస్తుంటే.., ఏపీలో చంద్రబాబుకి, జగన్ కి చెమటలు పట్టించడం బీజేపీకి లెక్క కాదు. కాకపోతే ఇక్కడ ఓటర్లను ఆకట్టుకోవడమే బీజేపీ కష్టం. అందుకే..!!
ఒక్కొక్కరికీ గాలం..! కలిసొస్తున్న కాలం..!!
ఏపీలో బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ మొదలు పెట్టింది. బలం పెంచుకుంటుంది. నాయకులను చేర్చుకుంటుంది. గల్లీ స్థాయి లీడర్ అయినా.., నియోజకవర్గ స్థాయి లీడర్ అయినా వెంటనే కాషాయ కండువా వేసేసి.., జై మోడీ, జై భారత్, జై బీజేపీ అనిపించాలనేది వారి ఆలోచన. ఈ నేపథ్యంలోనే కొందరు కీలక నేతలపై కూడా కన్నేసింది.
* టీడీపీలో కళా వెంకట్రావు ప్రాబల్యం తగ్గింది. పార్టీ అధ్యక్షుడిగా దించేసిన తర్వాత ఆయన చురుకు తగ్గించారు. అలా అని పార్టీ మారే పరిస్థితి లేదు. అందుకే ఆయన కుటుంబంలో కీలక నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. బీజేపీలో మంచి పదవి ఇస్తామంటూ కళా వెంకట్రావుని కూడా ఆహ్వానిస్తుంది. ఆయన వస్తే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తూర్పు కాపులో పట్టు పెరుగుతుంది అనేది బీజేపీ వ్యూహం. ఇప్పటికే రెండు సార్లు భేటీలు జరిగాయి.
* విజయనగరం జిల్లాలో పట్టున్న బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన దాదాపు ఖరారైనట్టే. ఆయనతో పాటూ గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ కూడా బీజేపీలోకి దూరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ వస్తే బీజేపీకి విజయనగరం జిల్లాలో జోష్ పెరిగినట్టే.
* ఇక విశాఖ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనకు వైసిపిలోకి వెళ్లేందుకు జగన్ అడ్డుకట్ట వేశారు. పైగా గంటా అవినీతి వ్యవహారాలన్నీ బయటకు లాగుతున్నారు. అందుకే ఈ క్రమంలో గంటా ప్రతిపక్షంలో ఉండలేరు. తన అక్రమ సామ్రాజ్యం కాపాడుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వ బలం కావాలనుకుంటున్న గంటా బీజేపీలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు.