ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా కాక రేపుతోన్న అంశం ‘అమరావతి వర్సెస్ మూడు రాజధానులు’. 2014లో కొత్త రాష్ట్రం.. అనుభవం ముఖ్యం అంటూ అధికారంలోకి వచ్చింది టీడీపీ. అయిదేళ్లలో టీడీపీ చేసిన ఒప్పులు, తప్పులు కలగలిపి 2019ay జగన్ ముఖ్యమంత్రి అయ్యేలా చేసాయి. ప్రభుత్వం మారాక రాజధాని మారుతోంది. రాష్ట్రం నడిబొడ్డులో రాజధాని అంటూ అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి 33వేల ఎకరాలు తీసుకుంది. అయిదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో కొన్ని పనులు చేయగలిగింది. అధికారం పోదు అనే గర్వంతో ఉన్న టీడీపీకి 2019 ఎన్నికల ఫలితాలు శరాఘాతంలా తగిలాయి. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని రాజధాని కాదని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది.
నష్టపోయింది అమరావతి రైతులే..
పంటలు బాగా పండే భూములు ఇచ్చిన రైతులు తమ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు. కానీ.. అదే ఈరోజు వారి పాలిట శాపమైంది. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు గొంతెత్తాయి. కానీ.. చంద్రబాబును చూసి రైతులు భములిచ్చేశారు. పోనీ.. టీడీపీ చెప్పింది చెప్పినట్టు చేసిందా అంటే.. ఆ భూముల్లో రైతులకు కొలతలు వేసి కొందరికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసింది. నిర్మాణాలు చేపట్టింది. సెక్రటేరియట్, హైకోర్టు.. కట్టి తాత్కాలికం అంది. అపార్ట్ మెంట్ల నిర్మాణం మధ్యలో, చివరి దశలో ఉండిపోయాయి. ఇవన్నీ ఇప్పటి ప్రభుత్వానికి తప్పిదాలుగా అనిపించాయి. అసెంబ్లీలో అమరావతికి జై కొట్టిన జగనే ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. పంటలు లేక, భూముల అభివృధ్ది లేక భవిష్యత్ కోసం రెడ్డెక్కారు. వీరిని ప్రభుత్వం కానీ.. చంద్రబాబు కానీ పట్టించుకోవడం లేదు.
రైతుల బాధలకు టీడీపీదే బాధ్యత..
మూడు రాజధానుల అంశంలో ఎటు మాట్లాడితే ఏమవుతుందో అనే భయంతో టీడీపీ ఉండిపోయింది. అమరావతి రైతుల తరపున గట్టిగా మాట్లాడింది లేదు. అధికారంలో ఉండగా అమరావతి రాష్ట్రానికి రాజధాని అని చెప్పిన టీడీపీ.. అధికారం కోల్పోయాక అదే మాటతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేయలేక పోయింది. ప్రతి జిల్లాలో అమరావతి గురించి టీడీపీ రోడ్డెక్కి ఉంటే రైతులకు వెన్నుదన్నుగా ఉండేది. కానీ టీడీపీ ఆ పని చేయకపోగా తూతూ మంత్రంగా సపోర్ట్ చేస్తోంది. పోరాటాలు చేసి జైలుకెళ్తే టీడీపీ రైతులకు అండ, అమరావతి కోసం చిత్తశుద్ధి ఉన్నట్టు ఉండేది. కానీ.. టీడీపీ పోరాటం శూన్యం. అమరావతిలో పనులు మొదలయ్యాయి కదా అని సీఎం జగన్ కు లేదు.. అమరావతే రాజధాని అని టీడీపీ గట్టిగానూ లేదు. మధ్యలో నష్టం మాత్రం రైతులదీ.. ఆంధ్ర ప్రజలదీ.!