(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని గుంటూరు జిల్లా రేపల్లే టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. రాజధాని అమరావతి విషయంలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. నిరసన తెలిపేందుకు టెంట్లు వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదని పేర్కొన్నారు. అమ్మవారి గుడికి వెళ్లే మహిళలను కూడా అడ్డుకొని పోలీసులు చితకబాదారని లేఖలో వివరించారు. మహిళలను రాత్రి ఎనిమిది గంటల వరకు పోలీస్స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.