(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మండలి విషయాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. బిఎసి సమావేశం గురించి ఒక్క రోజు ముందు కాకుండా అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పారనీ దీంతో తాను హెలికాఫ్టర్ పంపితే వస్తానని చెప్పాననీ ఆయన వెల్లడించారు.
ఏడు నెలల కాలంలో శాసనమండలికి 32 బిల్లులు పంపితే ఒక్క బిల్లునయినా తమ సభ్యులు వ్యతిరేకించారా అని ప్రశ్నించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లను సెలెక్ట్ కమిటీకి పంపారని ఆయన వివరించారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మండలి రద్దు బిల్లును సభలో పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
మూడు రాజధానులు తమకు వద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే విలువలు లేని కమిటీలు వేసి రాజధాని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపితే జగన్కు నిద్రపడ్డటం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కేసులు పెడతామని భయపెట్టి ఎమ్మెల్సీలను పార్టీలోకి లాక్కోవడం మంచి పద్దతా అని ఆయన ప్రశ్నించారు.