బాబుని ఒంటరి చేయాలి. ప్రతిపక్ష హోదా లాగేయ్యాలి. టీడీపీ కి భవిష్యత్తు లేకుండా చేయాలి. ఆ కులంలో మనకు అనుకూలంగా ఉన్నవారిని లాగేసి, మిగిలిన వారిని ఒంటరిగా మార్చేయాలి. ఇవే… అచ్చంగా ఇవే జగన్ స్కెచ్చులు. ఇవే ఇప్పుడు అమలవుతున్నాయి. కరోనా, లాక్ డౌన్ విషయాలు కాస్త చప్పబడడంతో ఇప్పుడు వైసీపీ వ్యూహాలకు తెరతీశారు. దీనిలో భాగంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈరోజు సాయంత్రమే జగన్ ని కలిసి, ఆ పార్టీలో పరోక్షంగా చేరిపోనున్నారు. వీరితో ఆగదు “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పినట్టు మరో ఇద్దరు కూడా సిద్ధంగానే ఉన్నారు. వారూ మరో వారం, పది రోజుల్లో ఇదే బాట పట్టానున్నారు.
ఆ కారణాలు ఇవే…!
పార్టీలు మారాలంటే ఒకప్పుడు బలమైన కారణాలు ఉండాలి. సిద్ధాంతాలను పక్కన పెట్టాలి. కానీ ఇప్పుడు అవేమి అవసరం లేదు. పెత్తనం కావాలి, అధికారం కావాలి, ఆర్ధికంగా ఎదగాలి, పనులు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే తపన ఉంటే చాలు… పార్టీలు మారిపోవచ్చు. గత టిడిపి హయాంలో మార్పులు అవే చెవుతున్నాయి6, ఇప్పటి వైసీపీ హయాంలో మార్పులు అవే చెప్తున్నాయి. ఇక్కడ పర్చూరు ఎమ్మెల్యే కు ఆర్ధికంగా కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వంతో కీలక పనులు ఉన్నాయి. అందుకే తప్పక ఆయన చేరిపోతున్నారు. రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్ కి కూడా ఇదే తరహా అవసరాలు ఉన్నాయి. పైగా ఈ రెండు నియోజకవర్గాల్లో వైసిపి లో బలమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కూడా సానుకూలంగా స్పందించి ఆహ్వానిస్తోంది.
సామాజిక మంత్రం… జగన్ జపం…!
నిజానికి వైసిపి అధినేత, సీఎం జగన్ కి పెద్దగా కమ్మ సామాజిక వర్గం అంటే గిట్టదు. బహుశా చంద్రబాబు పై వ్యతిరేకత కారణంగా ఆయన స్వతహాగానే ఆ సామాజికవర్గం పై విమర్శలు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆ సమాజికవర్గ నాయకుల్ని కూడా పార్టీలో చేర్చుకుంటూ తన వైఖరికి భిన్నంగా ఉంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ సామాజికవర్గం లో జగన్ కి అనుకూలంగా వుండే వారిని తీసుకుని.., మిగిలిన వారిని ఆర్థికంగా దెబ్బతీసి రాజకీయంగా భవిష్యత్ లేకుండా చేయడం.., చంద్రబాబు ని ఆ సామాజికవర్గం లో ఒంటరిగా చేయడం వంటి సున్నితమైన లక్ష్యాలతో జగన్ ఇలా చేర్చుకుంటున్నారని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా తన సొంత సామాజికవర్గం లో ఎలాగూ తను బలంగా ఉన్నారు…, తమ వ్యతిరేక సామాజికవర్గంలో కూడా తన పార్టీ ఎదుగుతుందని జగన్ ఆలోచన కావచ్చు. కానీ ఈ సామాజికవర్గ ఆటలు, రాజకీయాలు పెద్దగా అనుకున్నట్టు జరగవు అని జగన్ గ్రహిస్తే ఆయన కన్ను ఆయన పొడుచుకోకుండా ఉన్నట్టే…! లేకుంటే ఆయన ఇప్పుడు తీసుకుంటున్న గోతిలో ఆయన పడడం ఖాయం.