(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో కుదరదని టిడిపి ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిని రద్దు చేయాలని సిఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని ఆయన అన్నారు. శాసనమండలి రద్దు సిఫార్సు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయగలదనీ, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానిదేనన్నారు. మండలి రద్దు నిర్ణయం అమలు జరిగేలోపు జగన్ జైలులో ఉంటారని ఆయన జోస్యం చెప్పారు.
చట్టాన్ని అతిక్రమించి చేసిన బిల్లులు కాబట్టి మండలి వ్యతిరేకించిందని పేర్కొన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో మెజార్టీ ఉంది కదా అని తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి జగన్ తీరును ఆయన తప్పుబట్టారు
శివరామకృష్ణన్ కమిటీకి 507మంది మాత్రమే విశాఖకు అనుకూలంగా తమ అభిప్రాయాలు తెలిపారనీ, కానీ 5038 మంది ప్రజలు విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలని కోరుకున్నారని ఆయన చెప్పారు. రాజధాని తరలింపునకు సంబంధించి చట్ట సవరణ చేయాలంటే సెలెక్ట్ కమిటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏకపక్షంగా, కక్షసాధింపులతో వ్యవహరించే అధికార పక్షాన్ని దేశంలోనే ఎక్కడా చూడలేదని అశోక్బాబు వ్యాఖ్యానించారు.