అమరావతి: ఆంధ్రుల మనోభావాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి లెక్కలేని తనంగా మారిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం విషయంలో రాష్ట్రానికి కేంద్రం దాదాపు నెల రోజుల పాటు ఏన్నో లేఖలు రాసిందని లోకేష్ తెలిపారు.బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని కోరిందని లోకేష్ పేర్కొన్నారు. అఖరిక్షణంలో హెచ్చరించినా కూడా వైసిపి ప్రభుత్వం స్పందించలేదని లోకేష్ అన్నారు. దీనికి సంబంధించి హాన్స్ ఇండియా ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చిన కథనాన్ని లోకేష్ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ జగన్కు ప్రశ్నల వర్షం కురిపించారు.
‘అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు’ అని లోకేష్ ప్రశ్నించారు.
ఆంధ్రుల మనోభావాలంటే @ysjaganగారికి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. pic.twitter.com/IG0qPyEuvQ
— Lokesh Nara (@naralokesh) September 9, 2019