(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కేంద్ర సంప్రదాయాల ప్రకారం ఏపి శాసనమండలి రద్దు బిల్లు నేరుగా చట్టసభలకు వెళ్లకపోవచ్చని విజయవాడ ఎంపి కేశినేని నాని అన్నారు. మండలి ఉండాలా వద్దా అనేది స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. పది రాష్ట్రాల బిల్లులు స్టాండింగ్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో మండలి రద్దు బిల్లు స్టాండింగ్ కమిటీకి వెళ్లకుండా నేరుగా చట్టసభల్లోకి తీసుకువస్తే బిజెపి, వైసిపి మధ్య రహస్యబంధం ఉన్నట్లు భావించాల్సి వస్తుందన్నారు.
మూడు రాజధానుల ఆలోచన, మండలి రద్దుపై సిఎం జగన్ వైఖరిని ఢిల్లీలో తగిన వేదికపై లేవనెత్తుతామని నాని తెలిపారు. అవసరమైతే ప్రధాని మోదిని కలిసి జగన్ వైఖరిని వివరిస్తామని ఆయన చెప్పారు. రాజధాని తరలింపు అంగుళం కూడా కదలదని కేశినేని అన్నారు.
కేశినేని వ్యాఖ్యలను మంత్రి బొత్సా సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రతినిధి, అంగుళం కూడా కదలదు అని చెప్పడానికి ఆయన ఎవరు అని బొత్సా ప్రశ్నించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం చెప్పింది చేసి తీరుతుందన్నారు. ఇప్పటికే వికేంద్రీకరణ ప్రక్రియ పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు.