(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్ అప్పుడే కబ్జా చేస్తోందని ఆయన విమర్శించారు. హత్యలు, కబ్జాలతో వచ్చే రాజధాని తమకు అవసరం లేదని ఆయన అన్నారు. విశాఖలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ప్రజలు భయపడుతున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. విశాఖ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు.
టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టులను వైసిపి ప్రభుత్వం వెళ్లగొట్టిందని ఆయన ఆరోపించారు. ఎర్రన్నాయుడు కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల కోసమే పోరాటం చేస్తోందని అన్నారు. తాము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకుంటున్నామని చెప్పారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలన్నారు.
మూడు రాజధానుల అంశం, మండలి రద్దును పార్లమెంట్లో అడ్డుకుంటామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జగన్ తీసుకునే అప్రజాస్వామ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు.