న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేసి పార్టీ కార్యాలయాలుగా మార్చిందని టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వైసిపి ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వారు అన్నాడు. కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను నవరత్నాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఉపాధి హామీ కింద గతంలో చేసిన పనులకు బిల్లులను ఆపేశారనీ, ప్రభుత్వం తీరుతో చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందనీ ఎంపిలు అన్నారు.