(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి : అధికార వైఎస్ఆర్ సీపీలో నేతల ధిక్కార స్వరం వెనుక తెలుగుదేశం వ్యూహం ఉందా?, టీడీపీ నేతల ఎరకు వైసీపీ ఎమ్మెల్యేలు చిక్కారా? అందుకే ఎప్పుడు లేని విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
రాజకీయాలలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. గడచిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లతో అఖండ మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు టీడీపీ నుండి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీతో జతకట్టారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు లబ్దిదారులకు సక్రమంగా అందుతుండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్ది పాలనపై మెజారిటీ వర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ కారణంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయంగా ఎంత దూకుడు ప్రదర్శించినా ప్రయోజనం కనిపించలేదు. నిజానికి జగన్ ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలపై ప్రతిపక్షం ఎదురు దాడి చేసింది. అనేక నిరసనలు వ్యక్తం చేసింది. అనేక మందితో తెరవెనుక ఉండి.. న్యాయ పోరాటం చేసేలా ప్రయత్నించింది. అయినా కూడా టీడీపీ ఎక్కడా పుంజుకోలేక పోయింది.
ఈ నేపథ్యంలోనే వైసీపీలో అంతర్గత రచ్చకు టీడీపీ పరోక్షంగా ప్రయత్నించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైనే అధికంగా దృష్టి సారించి ఆ పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ కారణంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు నేతలు బాహాటంగానే ప్రభుత్వంపై పరోక్షంగా మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదనీ, దీంతో తాము ఏమి చేయలేకపోతున్నామనీ వాపోతున్నారు. వారు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అధినేత, సీఎం జగన్ను ఇరుకున పెడుతున్నాయి.
అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో నియోజక వర్గాలలో అభివృద్ధి పనులపై తీవ్రంగా విరుచుకుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అదే సమయంలో స్థానిక నేతలపైనా తీవ్ర విమర్శలు చేయాలని కూడా సూచించారు. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ టీడీపీ నేతలు.. ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో తీవ్ర విమర్శలు చేశారు.
ఈ పరిణామాలతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారనీ, ఇది వైసీపీని నిజంగానే ఇరుకున పెట్టే అంశమని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ వ్యూహం ఫలించింది అన్న మాట వినబడుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?