(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గత ఎన్నికల్లో ఘారంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్ ఒటమి దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే కొలుకుంటోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ పునః నిర్మాణం చేసి మళ్లీ బలం సంతరించుకుందాం అని చంద్రబాబు అనుకున్న తరుణంలో కరోనా వచ్చి కార్యక్రమాలు అన్నీ యదాతథంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆరు నెలల పాటు పార్టీ కార్యక్రమాలు, ప్రతిపక్ష బాధ్యతలు ఏమీ నిర్వర్తించలేదు. కేవలం హైదరాబాదుకు, జూమ్ కు, ట్విట్టర్ కు మాత్రమే బాబు, లోకేష్ లు పరిమితం అయ్యారు. అయితే కరనా ప్రభావం తగ్గినా తగ్గకపోయినా ఇక రాజకీయాలు మొదలు పెట్టాల్సిందే అనుకుని ఆ పార్టీ ఇప్పుడిప్పుడే చురుకు అవుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడిప్పుడే చురుకై ప్రభుత్వంపై ఏదో రకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జిల్లాల వారిగా టిడిపి నాయకత్వ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది, దీనిలో భాగంగానే…
ప్రకాశం జిల్లాలో తెరపైకి కొత్త పేర్లు
గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లాలో ఆశాజనకంగానే తెలుగుదేశం పార్టీ ఫలితాలు సాధించింది. ఇప్పుడు జిల్లాల వారిగా ప్రక్షాళన కూడా ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెడుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్ధన్ పనితీరు పట్ల చంద్రబాబు ఎప్పటి నుండో అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గాల వారిగా పార్టీలో గ్రూపులను పోషించిన జనార్థన్ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పార్టీని ఏ మాత్రం పట్టించుకోకుండా పూర్తిగా హైదరాబాదుకే పరిమితం అయ్యారు. అందుకే ఆయన నాయకత్వంపై జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ముందుగా జిల్లా అధ్యక్షుడుగా అతనిని తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఒంగోలు పార్లమెంటరీ, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్త అనే స్థానాలను సృష్టించి కొత్త వారికి ఆ పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమన్వయకర్తగా రవికుమార్, పార్లమెంటరీ ఇంచార్జిగా ఉగ్ర
ప్రకాశం జిల్లాలో గత ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరి కనిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. ఇదే క్రమంలో బాపట్ల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ సమన్వయకర్తగా ఉండే కీలక బధ్యతను గొట్టిపాటి రవికుమార్ గారు అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి జిల్లా అధ్యక్షుడు మార్పు జరిగితే జిల్లా అధ్యక్షుడిగా గొట్టిపాటి రవికుమార్ లేదా ఏలూరి సాంబశివరవు కే ఇస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల నియామకం చేసి నియోజకవర్గాల సమన్వయకర్త అనే బాధ్యతను గొట్టిపాటి రవికుమార్ కి అప్పగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ప్రకాశం జిల్లా తరువాతనే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాలపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి తమ సమన్వయకర్తలు, తమ సోషల్ మీడియా విభాగాల ద్వారా, తమ పార్టీ అంతర్గత నిఘా విభాగాల ద్వారా రిపోర్టులు తెప్పించుకుని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, పార్టీ జిల్లా సమన్వయకర్తలను నియమించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.