కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది ఏపీ పోలీసుల పరిస్థితి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఏదైనా అవినీతి ఆరోపణలు చేస్తే దానికి ఆధారాలు ఇవ్వాలంటూ ప్రశ్నిస్తున్న పోలీసులు అధికార పక్షాన్ని మాత్రం వదిలేస్తున్నారనేది ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు. ఇందుకు నిదర్శనమే సెక్షన్ 91 నోటీసు. గతంలో ఇదే విషయమై చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇవ్వడం లేదు అనేది టీడీపీ నేతల ఆరోపణ. అదేమిటో చూద్దాం..
చంద్రబాబుకు ఎప్పుడు నోటీసులు ఇచ్చారంటే..
చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఓం ప్రతాప్ ఆత్మహత్య ఘటనపై, ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈమేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన మదనపల్లి పోలీసులు ఆదారాలుంటే ఇవ్వాలని కోరుతూ, సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. డీజీపీకి లేఖ రాస్తే మదనపల్లి పోలీసులు స్పందించడం ఏకంగా నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏకంగా చంద్రబాబే అంతర్వేది కుట్రకు కారకుడంటూ ట్వీట్ చేయడంపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇస్తారా..
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్దం ఘటనపై రాష్ట్రం భగ్గుమంటోంది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లో.. ‘అంతర్వేదిలో రథానికి నిప్పుపెట్టించాడు.. బాబే హిందూత్వంపై దాడులకు మూలకారకుడు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపైనే టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు లేఖ రాసినందుకే నోటీసులు ఇచ్చినప్పుడు.. ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డికి సెక్షన్ 91 ప్రకారం నోటీసులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఏకంగా విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణల్లో చంద్రబాబే దోషి అని అన్నారు కాబట్టి ఇక సీబీఐ విచారణ ఎందుకన్నది వారి ప్రశ్న. అయితే.. ప్రతిపక్షం ప్రశ్నల ఆధారంగా విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వరనే విషయం తెలిసినా.. పోలీసులు మాత్రం విమర్శలకు గురవుతున్నారు.