‘హైదరాబాద్ ను అభివృద్ది చేసింది నేనే..’, ‘హైదరాబాద్ ను సాఫ్ట్ వేర్ పటంలో నిలబెట్టింది నేనే’, ‘నేను లేకపోతే అభివృద్ధి ఆగిపోయినట్టే’.. ఇవన్నీ చదివితే ఎవరి పేరు గుర్తొస్తుందో.. ఈ డైలాగులన్నీ నిత్యం పఠించేది ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో తాను సీఎంగా ఉన్న సమయంలో ఐటీనీ ప్రోత్సహించి, ఐటీ కంపెనీలు వచ్చేలా చేసింది, ఐటీ హబ్ గా మార్చింది, సైబర్ టవర్ కట్టింది.. తానే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ ఏపీలో చెప్తూనే ఉంటారు.. తెలంగాణ, హైదరాబాద్ లో చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి. కానీ.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తమ నాయకులు, అభ్యర్ధులు, కేడర్ కు పైమాటలను గ్రేటర్ ప్రజలకు మళ్లీ.. మళ్లీ చెప్పాలనీ చెప్తున్నారు.
హైదరాబాద్ లో ఐటీ మొదలైంది.. ఇలా..!
దేశంలో ఐటీ విప్లవానికి రాజీవ్ గాంధీ హయాంలోనే ఊపిరిలూదారని చెప్తారు. 1992లో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఇప్పటి సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసినదీ నిజమే. కానీ.. కాంగ్రెస్ కు సీఎంలను మార్చే కుసంస్కృతి, 1994లో ఓడిపోవడం ఆ పనులకు అడ్డం వచ్చింది. 1995లో సీఎం అయిన చంద్రబాబుకి ఈ పరిస్థితుల కలిసొచ్చాయి. సైబర్ టవర్ పూర్తైంది. 1998-99లో ఏపీలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 22 కోట్లు నుండి 575 కోట్లకు పెరిగింది. పైన చెప్పినట్టు బాకాలు ఊదుకుంది టీడీపీ. కానీ.. దేశం మొత్తం సాఫ్ట్ వేర్ ఎగుమతులు 6,300 కోట్లలో ఏపీ వాటా 575 కోట్లు మాత్రమే..
9 శాతం. కానీ.. కర్నాటక 2,888 కోట్లు, నోయిడా 1,430 కోట్లు, తమిళనాడు 800 కోట్లతో ఎంతో ముందున్నాయి. 2004 కి ఏపీలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 3 నుండి 5వ స్థానానికి పడిపోయాయి.
టీడీపీ కలలు నిజమవుతాయా..?
ఈ ముసుగులో అక్కడ చాలా రియల్ ఎస్టేట్ జరిగింది. 3 లక్షలకు ఎకరం అమ్ముకున్న రైతు కళ్ల ముందే అతి తక్కువ సమయంలో 3కోట్లు అయిందని వార్తలు వచ్చాయి. ఇవన్నీ చంద్రబాబు తన అనునూయలకే ఇచ్చుకున్నారని కూడా అంటారు. ఇవన్నీ తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు మర్చిపోలేదు. 2004 నుంచి తెలంగాణలో టీడీపీ దాదాపు పుంజుకోనిదీ.. కనుమరుగైందీ ఇందుకే. ఇప్పుడు టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తుందనే పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ.. దీనిని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ లో రాణించేస్తామని అనుకుంటే అది కలే అంటున్నారు. టీడీపీ.. మీకు అర్ధమవుతోందా..?