TDP: వైసీపీకి బాగా ప్రాబల్యం ఉన్న ప్రాంతంగా రాయలసీమను చెప్పుకోవచ్చు. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటం.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే సామాజికవర్గం కావడం వైసీపీకి బాగా కలిసొస్తుందనే చెప్పాలి. ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ కు ఈ సామాజికవర్గం ఆ ప్రాంతంలో అనుకూలంగానే ఉండేది. టీడీపీకి కూడా అక్కడ కొంత పట్టున్నా వైసీపీకి ఉన్న రెడ్డి సామాజికవర్గ పట్టు లేదనే చెప్పాలి. ఇప్పుడీ అంశంపైనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో మొదట్లో సంతోషంలో ఉన్న రెడ్డి వర్గంలో ఇప్పుడు వ్యతిరేకత ఉందని.. దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బాబు ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు.
వీరందరి ద్వారానే..
ఇందుకు టీడీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ద్వారా రాయలసీమలోని రెడ్లను టీడీపీ వైపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చిత్తూరులోని పీలేరు నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, అనంతపురం నుంచి జేసీ సోదరులు, చిత్తూరు నుంచి మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, మార్కాపురం ఇంచార్జి బ్రహ్మానందరెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగు నుంచి నారాయణ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. వీరి ద్వారా రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపుకు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టచ్చనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
వ్యూహం ఫలించేనా..
నిజానికి వైసీపీకి అన్ని ప్రాంతాల నుంచి సీట్లు గట్టిగా వచ్చాయి. అందులో 5 జిల్లాలు క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో నెల్లూరు కూడా ఒకటి. ఎన్నికలయ్యాక చంద్రబాబు తన సమీక్షలో.. నెల్లూరుకు ఎంతో చేశాం కదా.. అని వాపోయారంటే రెడ్డి ప్రాబల్యం వైసీపీకి ఎంత మద్దతుగా ఉందో తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ తీరుతో రెడ్లలో వ్యతిరేకత ఉందని పసిగట్టిన చంద్రబాబు ఆపరేషన్ రెడ్డిని స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. వైసీపీ తమ వర్గాన్ని వదులుకుంటుందా.. టీడీపీ ఆకర్షిస్తుందా.. రెడ్లు వైసీపీని వదిలి టీడీపీతో కలిసే ధైర్యం చేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?