TDP Strategy Failure: మన రాష్ట్రమయినా.., దేశమైన.. చివరికి ప్రపంచంలో ఏ దేశమైనా.. రాజకీయం అంటే ఒక ప్రాధమిక సూత్రం ఉంటుంది.. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతాయి.. ఆ వర్గాలకు తెర వెనుకో, ముందో మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతాయి.. కానీ.. ఏపీలో ఆ రాజకీయం జరగలేదు. ఉద్యోగ సంఘాల పోరులో టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటించింది.. కానీ అది తిరోగమనం చెంది.. సాధించిందేమీ లేక చతికిలపడింది.. మౌనం వెనుక వ్యూహం బెడిసికొట్టాయి.. వ్యూహం ముందున్న మౌనం మరోసారి ఆవహించి, చివరికి చేతులు దులుపుకుంది..!
TDP Strategy Failure: 35 లక్షల ఓటింగ్ ప్రభావం కదా..!?
ఆంధ్రప్రదేశ్ లో ఓ పెద్ద కుంపటి రాజుకుంది. దాదాపు 35 లక్షల ఓటింగ్ బలం ఉన్న ఉద్యోగ వ్యవస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చింది. కానీ మొట్టమొదటి సారిగా ఏపి రాజకీయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ప్రతిపక్షం పాల్గొన లేదు. మౌనంగా ఉంది. మాట్లాడటం లేదు. ఎందుకు..? టీడీపీ స్ట్రాటజీ ఏమిటి..? ఉద్యోగుల ఆందోళన విషయంలో టీడీపీ మౌనంగా ఎందుకు ఉంది..? ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు పోరు వీడాయి, ప్రభుత్వంతో కలిసాయి.. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ ఏం సాధించింది..!? అనే విషయాలను పరిశీలిస్తే.. టీడీపీ మాత్రం ఎక్కడా రెస్పాండ్ కాలేదు. అధికార ప్రతినిధులు గానీ, చంద్రబాబు, లోకేష్ గానీ ఉద్యోగుల ఉద్యమం మీద మాట్లాడలేదు. కానీ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. ఉద్యోగులకు అంతే కావాలి అని అంతర్గతంగా అనుకున్నారు తప్ప ఉద్యోగులకు మా మద్దతు ఉంటుంది అని చెప్పలేదు. వారితో కలిసి తాము ఆందోళన చేస్తామని ఎక్కడా అనలేదు..!
చివరి రోజున మాత్రమే చంద్రబాబు కాస్త గొంతు విప్పారు.. ఉద్యోగులకు అనుకూలంగా రెండు ముక్కలు మాట్లాడి ముగించారు.. కానీ ముక్తసరిగానే మాట్లాడారు. ఎందుకంటే ఉద్యోగులు వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఉద్యోగులు కోరుకున్నట్లు డిమాండ్ లను ప్రభుత్వం పరిష్కరిస్తే ఇదే ఉద్యోగులు సీఎం జగన్మోహనరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తారు. జిందాబాద్ లు కొడతారు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారో చలో విజయవాడ చేసారో వాళ్లు అడిగినవి ఇచ్చేస్తే ఖచ్చితంగా ఉద్యోగులు ఆ పార్టీకి కంకణబద్దులు అయిపోతారు. 2019 ఎన్నికల్లో ఎలాగైతే రెండు చేతులతో ఓట్లు వేశారో 2024 ఎన్నికల్లో నాలుగు చేతులతో ఓట్లు వేస్తారేమో, మా జగనన్నను తప్పు గా అర్ధం చేసుకున్నాము, ఆయన మంచి వారు. మాకు అన్నీ ఇచ్చారు అని కూడా అంటారు..! సో.. ఉద్యోగులు మొదటి నుండి బాబుకి వ్యతిరేకం.. టీడీపీ వీళ్లకు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా ఒకటేననే సంగతి ఉద్యోగులకు తెలుసు, బాబు బ్యాచ్ కి తెలుసు..!
ఉద్యోగులు కూడా జగన్ పై జాగ్రత్తగానే..!
ఈ మొత్తం పోరు సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతల ప్రసంగం వింటే ఓ విషయం అర్ధం అవుతుంది. “జగన్మోహనరెడ్డి మంచి వాళ్లే, ఆయన వద్ద ఉన్న టీమ్.. పెత్తనం చేస్తున్న వాళ్లే చెడ్డవాళ్లు. సీఎంను వీళ్లే తప్పుదోవ పట్టిస్తున్నారు, సీఎంతో తాము నేరుగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి” అని పదే పదే సీఎం జగన్ పై తమ ప్రేమని చాటుకున్నారు. అందుకే ఉద్యోగుల వ్యవహార శైలి టీడీపీ కనిపెట్టింది. ఉద్యోగులను నమ్మి ధీమాగా ఉంటే వీళ్లు మళ్లీ జగన్ కు పాలాభిషేకం చేస్తారు, అప్పుడు టీడీపీ నిండా మునిగిపోవడం ఖాయం అని టీడీపీ కూడా అనుకుంది. అయినప్పటికీ ఉద్యోగుల ఆందోళనను తప్పుబట్టడం లేదు. ఉద్యోగులు చిన్నబోయేలా చేయడం లేదు. నూట్రల్ గా వ్యవహరిస్తోంది. వాళ్ల ఆందోళన వాళ్లు చేసుకోనివ్వండి, ప్రభుత్వం ఏమి చేస్తుందో చూద్దాం అన్న ధోరణిలో టీడీపీ ఉంది. ఎక్కడైనా ఉద్యోగుల మీద లాఠీ చార్జి లాంటి బలప్రయోగాలు చేస్తే అప్పుడు టీడీపీ స్పందించేది.కానీ అంతగా స్పందించాల్సిన అవసరం రాలేదు కాబట్టి ప్రతిపక్షం వ్యూహాత్మకంగా మౌనం వహించి.. ఒక పెద్ద పోరాటంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోయింది..!