ఎమ్మెల్సీ పోతుల సునీతను ఆ పదవికి అనర్హురాలిగా ప్రకటింప చేయాలన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆమెను వెంటాడుతోంది.
టిడిపి తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన సునీత ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడమే కాకుండా టిడిపి విప్ ధిక్కరించి జగన్ ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిన మూడు రాజధానులు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీ పదవికి అనర్హురాలి గా ప్రకటించాలంటూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది.దీంతో షరీఫ్ ఇప్పటికి ఎనిమిది సార్లు విచారణ నిర్వహించగా ఆమె ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంది.తాజాగా గత సోమవారం నాడు విచారణకు ఆమె హాజరుకాకుండా తన న్యాయవాదిని పంపి తన తల్లికి కరోనా సోకిందని అందువల్ల రాలేనని ఇంకో వాయిదా తీసుకున్నారు.
అయితే సునీత కావాలనే విచారణకు గైర్హాజరు అవుతుందని గ్రహించిన టిడిపి మాస్టర్ ప్లాన్ వేసింది.గురువారం ఆమె చీరాల్లో జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ఫోటోలను అమరావతి నుండి వచ్చిన టిడిపి బృందం సేకరించి శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు పంపినట్లు సమాచారం. రెండు మూడు రోజుల క్రితం తల్లికి కరోనా అని చెప్పిన సునీత నాలుగో రోజున ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారో మండలి చైర్మన్ షరీఫ్ విచారించాలని విప్ టిడిపి విప్ వెంకన్న కోరినట్లు భోగట్టా.
త్వరితగతిన విచారణ ముగించి పోతుల సునీతను ఎమ్మెల్సీ పదవికి అనర్హులుగా ప్రకటించాలని టిడిపి మరోసారి డిమాండ్ చేసింది. విచారణకు హాజరు కాకుండా సునీత కుంటిసాకులు చెబుతోందని టిడిపి రుజువు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.శాసనమండలిలో టీడీపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున చైర్మన్ షరీఫ్ కు కూడా టిడిపి వారే అయినందున ఈసారి సునీత తప్పించుకునే అవకాశమే లేదని టిడిపి పార్టీ వర్గాలు చెబుతున్నాయి