రాజధాని వికేంద్రీకరణను టిడిపి జీర్ణించుకో లేకపోతోంది. రాజధానిగా అమరావతి ఉంటే చంద్రబాబు ముద్ర రాష్ట్రంపై ఎంతో కొంత పనిచేస్తుంది. హైదరాబాద్ ను వదిలేసి వచ్చినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ అంటే చంద్రబాబు హయాంలో నిర్మించిన సైబర్ టవర్స్ వంటి ఆధునిక కట్టడాలు గుర్తొస్తాయి. అలాగే అమరావతి రాజధానిగా కొనసాగితే చంద్రబాబు హయాంలోనే రూపొందుకున్న ప్రణాళికలు, భవనాలు చెరగని ముద్రగా ఉండిపోతాయి.
అంటే టిడిపికి అమరావతి రాజకీయంగా కలిసి వచ్చినా రాకపోయినా ఒక జ్ఞాపకంగా మాత్రం మిగిలిపోతుంది. ఆ జ్ఞాపకాల్ని చెరిపేస్తూ క్రమంలో వైఎస్ జగన్మోహన రెడ్డి కీలక అడుగులు వేశారు. మూడు రాజధానులు బిల్లు ఆమోదించేలా చేసి పాలన వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టారు. దీనిపై టిడిపి గట్టి పోరాటానికే సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి ఈ పోరాటం ఎలా చేయాలా అని టిడిపి ముఖ్యులతో చంద్రబాబు దఫ దఫాలుగా చర్చలు జరుపుతున్నారు.
ఆమరణ దీక్ష ఆలోచన ఉన్నప్పటికీ..!
అమరావతికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన టిడిపి పెద్దల్లో వచ్చిందట. తెలంగాణ సాధించే క్రమంలో నాడు కేసీఆర్ గట్టి పోరాటం చేశారు. 2009 డిసెంబర్ 9న కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఉద్యమం రెండవ దశకు ఊపిరి పోసుకుంది. తద్వారా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. నేడు అమరావతి అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నా, బిజెపి పెద్దలు పట్టించుకోవాలన్నా దేశం మొత్తం దృష్టి రాష్ట్రంపై, అమరావతిపై పడాలన్నా చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు ఆమరణ దీక్ష చేస్తే బాగుంటుంది .అనే ఆలోచన కొంత మంది టిడిపి పెద్దల్లో వ్యక్తం అయిందట. అయితే చంద్రబాబు వయసు, ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని కూడా భావిస్తున్నారట. అమరావతికి మద్దతుగా ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటనే చంద్రబాబు ఆమరణ దీక్ష కు కూర్చొని, మంగళగిరి ప్రాంతంలో నారా లోకేష్, జిల్లాల వారీగా జిల్లా స్థాయి నాయకులు ఆమరణ దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అని టిడిపి ఆలోచిస్తోంది.
రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుంది? మరో ఆలోచన..!
ఆమరణ దీక్ష కాకపోతే పోరాటానికి మరో అస్త్రం రాజీనామాలు చేయడం. అంటే తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లడం. అమరావతి రాజధాని అంశం అజండాగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం. అయితే ప్రస్తుతం ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో రాజీనామా నిర్ణయానికి చాలా మంది అంగీకరించే అవకాశం లేదు. అంటే ఆ ప్రాంతాల సెంటిమెంట్లు..
ఇతర జిల్లాల పరిస్థితులు చూసుకుని మళ్ళీ గెలుస్తామా లేదా అనుకుంటే చాలా మంది తిరిగి గెలిచే అవకాశం లేదు అని అంతర్గతంగా మధన పడుతున్నారట. అందుకే అన్ని జిల్లాల్లో 20 మంది కాకపోయినా కృష్ణ, గుంటూరు జిల్లాలోని ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి పోరాటాన్ని ఉదృతం చేసి వైసీపీ ఒత్తిడి తీసుకురావాలని కూడా టిడిపి యోచిస్తోంది. ఇలా రాజధాని పోరాటంలో భాగంగా టీడీపీ వద్ద ఎటువంటి సంచలనాత్మక ఆలోచనలు ఉన్నాయి. ఆ పెద్దలు ఏమి నిర్ణయిస్తారు? చంద్రబాబు ఏమి ఖరారు చేస్తారు అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.