(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ నాయకుల విమర్శలకు అర్థం లేకుండా పోతున్నది. గతంలో రాజకీయ నాయకులు విధాన పరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ఉండేవి. అధికార, విపక్ష నాయకులు హుందాగా వ్యవహరించే వారు. ఒక్క రాయలసీమ ఏరియాలో మినహా ఇతర ప్రాంతాల్లోని వివిధ రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీ నేతలతో కలుపుగోలుగానే ఉంటుండేవారు. రాను రాను నేతలు వ్యక్తిగత విమర్శలు, దూషణలు, కుటుంబ విషయాలను తెరపైకి తీసుకుని వచ్చి రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న సామాన్య ప్రజానీకం మనం ఎటు వైపు వేళతున్నాం అనే భావన వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తిరుమలలో పింక్ డైమండ్ మాయం అయ్యిందనీ, అది చంద్రబాబు ఇంట్లో ఉందంటూ తీవ్ర ఆరోపణ చేశారు. ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కూడా స్వామివారికి పింక్ డైమండ్ ఉండేదని ఇప్పుడు కనిపించడం లేదనీ పేర్కొన్నారు. ఇప్పుడు అసలు స్వామివారికి పింగ్ డైమండ్ అనేదే లేదని అంటున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పింక్ డైమండ్ గురించి ఏమైనా విచారణ జరిపించారా అంటే అదీ లేదు. లేని పింక్ డైమండ్ గురించి ఆరా తీస్తే ఏమి ఉపయోగం అనుకున్నారో ఏమో మిన్నకుండిపోయారు.
అప్పుడు విజయసాయి రెడ్డి అన్నట్లుగానే ఇప్పుడు దుర్గగుడిలో అమ్మవారి రథం వద్ద మూడు వెండి సింహాలు మాయం అయిన ఘటనను పురస్కరించుకుని అవి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో ఉన్నాయంటూ టీడీపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు సుంకర పద్మ శ్రీ ఒక అడుగు ముందుకు వేసి ఆ వెండి సింహాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి చేరాయంటూ ఆరోపించారు. వారు చేసినా వీరు చేసిన ఈ అవన్నీ అర్థం పర్ధం లేని ఆరోపణలు అందరికీ తెలుసు. కానీ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మానడం లేదు.
నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారం, ఆ తరువాత ఇంగ్లీషు మీడియం, ఆ వెంటనే రాష్ట్ర ఎన్నిక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ఇళ్ల పట్టాల భూముల కొనుగోలు కుంభకోణం, అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్ ఇలా అన్నింటిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు అయిపోయాయి. ఇప్పుడు తాజాగా హిందూ సెంటిమెంట్ వ్యవహారాలపై నడుపుతున్నారు.
విజయవాడ కనకదుర్గ గుడిలో మాయం అయిన మూడు వెండి సింహాల విషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయనా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలను ఎంచుకుని ప్రత్యర్థులను ఇరుకున పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. నాడు వైసీపీ నేతలు తిరుమల వెంకన్ పింక్ డైమండ్ ను రాజకీయ అస్త్రంగా వాడుకుని చంద్రబాబుపై విమర్శలు చేయగా ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీలు కనకదుర్గ వెండి సింహాల అపహరణను వాడుకుని సిఎం జగన్పై విమర్శలు చేయడం గమనార్హం.