హైదరాబాదు, జనవరి 17: తెలంగాణ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం 11.30గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గజ్వేలు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. శాసనసభ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేస్తారని భావిస్తున్నారు.
ఈ శాసనసభలో కొత్తగా ఎన్నికైన వారు 23మంది ఉండగా గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు 76మంది, ఎంపిలుగా చేసి ఎమ్మెల్యేలుగా వచ్చిన వారు ఇద్దరు, ఎంఎల్సిగా ఉండి శాసనసభకు పోటీ చేసి గెలిచిన వారు ముగ్గురు ఉన్నారు. ఆరుగురు మహిళా సభ్యులు ఎన్నికయ్యారు.
ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యేగా నిలిచారు.
19న ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగించనున్నారు. 20న గవర్నర్ ప్రసంగంపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది.