నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదిక గా జరిగిన ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటోంది. ఆయా పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ముగ్గురుని అరెస్టు చేసి పోలీసులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదికగా జరిగిన ఈ ఘటన పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేయించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ రాష్ట్ర శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు సిట్టింగ్ జడ్జి న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ తన పిటిషన్ లో అభ్యర్ధించింది.
రాష్ట్ర పోలీసుల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాన్ని వేయాలని బీజేపీ కోరింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్ లో బీజేపీ కోరింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ఫిరాయింపు కోసం ప్రలోభ పర్వానికి గురి చేసే క్రమంలో భారీ ఆపరేషన్ ను చేపట్టినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ తరపున పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుజ్జల ప్రేమ్ందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారనీ, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిలో డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్ హెచ్ ఓ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.