YS Jagan BJP: 2019 ఎన్నికల ప్రచారం టైంలో.. అదేవిధంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఫలితంగా జరిగిన ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని సాధించారు. ఇప్పుడు ఇదే జగన్ నినాదాన్ని తెలంగాణ బీజేపీ ఎత్తుకుంది. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. “ప్రజా సంగ్రామ యాత్ర” పేరిట బండి సంజయ్ చేపడుతున్న ఈ యాత్ర ప్రస్తుతం నారాయణపేట జిల్లాకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఇటీవల అక్కడ వాల్మీకి, బోయల వద్దకు వెళ్లి బండి సంజయ్ ముచ్చటించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీని గెలిపిస్తే వాల్మీకుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మత పరమైన రిజర్వేషన్ లకు బీజేపీ వ్యతిరేకమని..అన్నారు. అదేవిదంగా వాల్మీకులను ఎందుకు ఎస్టీ జాబితాలో చేర్చడం లేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మజ్లిస్.. కేసిఆర్ కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఎవరు గాని కేసిఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చేయనీ సెటైర్లు వేశాడు. కేసిఆర్ కుటుంబం నెలకు పాతిక లక్షల జీతం తీసుకుంటుందని చెప్పారు. కేసిఆర్ ని గద్దె దించాలన్న కసితో పాదయాత్ర చేస్తున్నట్లు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో రిజర్వాయర్ లకు నీళ్లు రావు గాని.. కేసీఆర్ ఫామ్ హౌస్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తేప్పించుకుంటారు అని బండి సంజయ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో కూడా నీటి సమస్య ఉంది. మూడు కోట్లకు పైగా ఖర్చు పెడతే ఈ ప్రాంతానికి ప్రభుత్వం మేలు చేసినట్లువుతుంది. ఆరు నెలల్లో నీళ్లు తీసుకురావచ్చు. మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత ఏడు సంవత్సరాల నుండి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. “దళితబంధు” పేరుతో దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎంత మంది దళితులకు “దళిత బందు” ఇచ్చారో లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లించారు అని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నారాయణపేట ప్రజలను బండి సంజయ్ కోరారు. తెలుగు రాజకీయాలలో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ దిశగానే బండి సంజయ్ .. ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ బీజేపీకి పట్టం కడతారో లేదో చూడాలి.