అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఎంపిక చేయడాన్ని బిజెపిలో అతివాదిగా ముద్రపడిన ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీటులో ఉండగా తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోనని రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలోకి కూడా తాను అడుగుపెట్టనని రాజా సింగ్ శపథం చేశారు. ఇటీవలి ఎన్నికలలో బిజెపి తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.
‘దేశంలో హిందువులు లేకుండా చేయాలని చూస్తున్న పార్టీకి చెందిన వ్యక్తి స్పీకర్ కుర్చీలో కూర్చుని ఉండగా నేను ప్రమాణ స్వీకారం చేసేది లేదు’ అని చెబుతూ ఆయన ట్విట్టర్లో ఒక వీడియో సందేశం పోస్టు చేశారు. ‘వారు ఏనాడూ వందేమాతరం పాడరు, ఏనాడూ బారత్ మాతాకీ జై అనరు’ అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
వివాదాస్పదుడిగా పేరున్న రాజాసింగ్ మతపరమైన ఆవేశాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంలో అందె వెసిన చేయి. ఆయనపై 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.