తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ రంగానికి సంబంధించి పలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రణ సాగును రద్దు చేస్తూ కేసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇక పై రాష్ట్రంలోని రైతులు తమకు ఇష్టమున్న ప్రదేశంలో పంటను విక్రయించుకోవచ్చని సీఎం కేసిఆర్ ప్రకటించారు. రైతులు తాము నచ్చిన పంట వేసుకోవచ్చని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. పంటల కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500లు కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసిఆర్ వెల్లడించారు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ఈ సందర్భంగా కేసిఆర్ వ్యాఖ్యానించారు.
అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తూర్పార పట్టిన కేసీఆర్..ఇప్పుడు అవే చట్టాలను సాకుగా చూపుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే ఇదే సందర్భంగా రైతులకు భారీగా ఊరట కల్గించేలా మరో నిర్ణయం తీసుకున్నారు కేసిఆర్. సోమవారం (డిసెంబర్ 28న) రైతు బంధు పథకం డబ్బులను రైతుల ఖాతాలో జమ చేేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో వ్యవసాయ రంగానికి సమస్యలు, ప్రగతిపై సమీక్ష జరిపారు. పలువురు కీలక నేతలు, పలువురు ఉన్నతాధికారులతో కెసిఆర్ చర్చించి ఈ నిర్ణయాలను ప్రకటించారు.
నియంత్రణ సాగులో భాగంగా సన్నరకం వడ్లను పండించాలన్న కేసిఆర్ ప్రభుత్వ నిర్ణయానికి రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమీక్ష జరిపి ఈ నిర్ణయం తీసుకున్నది. ఎప్పుడు ఏ పంట వేయాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించారు. పంటల సాగుకు సంబంధించి ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయదని స్పష్టం చేశారు. రైతు బంధు పథకం కింద 7,515 కోట్లు పంట సాయంగా అందిస్తున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించారు.