కరోనాను ఎదుర్కోవడంలో అందరికంటే ముందే అతి చేసి, అందరి కంటే ముందే చేతులెత్తేసి, అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటోంది తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించక ముందే తెలంగాణలో కేసీఆర్ కరోనా లాక్ డౌన్ ప్రకటించేసారు.
ప్రధాన మంత్రి మోదీ రెండవ సారి వీడియో సందేశం ఇచ్చి లాక్ డౌన్ పొడిగించకముందే ఇక్కడ తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండవ సారి లాక్ డౌన్ పొడిగించేసారు. అయన కంటే ఎక్కువ సార్లు కేసీఆర్ ప్రెస్ మీట్ లు పెట్టారు. అందరి కంటే ఎక్కువ హడావుడి చేశారు. ఇదిగో వెళ్ళిపోతుంది. కరోనా ను కబళించేసాం, కరోనాను కట్టడి చేసేసాం అంటూ నానా హడావుడి చేశారు. చివరికి అది మన కంట్రోల్ లో లేదు అని, అది అందరికీ సోకుతుందని అని తెలుసుకుని చేతులు ఎత్తేసి ఫామ్ హౌస్ కు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. ఈ సమయంలోనే గవర్నర్ తమిళి సై కరోనా పై అధికారులతో రివ్యూ కూడా చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తాపీగా వచ్చి పరిపాలన మొదలు పెట్టారు. సచివాలయం అని, ఉస్మానియా ఆసుపత్రి అని, వరదలు అని రకరకాలుగా చేస్తూ కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు. అయితే కరోనా విషయంలో, కరోనా పరీక్షల విషయంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటూ నాన్న అవస్థలు పడుతున్నారు. కేసీఆర్ కు ప్రతిపక్షాలు, హైకోర్టు నుంచే కాక గవర్నర్ నుంచి కూడా తాజాగా తలనొప్పులు ఎదురవుతున్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఏమన్నారంటే..
కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదన్నారు గవర్నర్ తమిళి సై. కరోనా ఉదృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణకు పెద్ద ఎత్తున టెస్ట్ లు చేయడమే పరిష్కారమన్నారు. మొబైల్ టెస్టింగ్ లు చేయాలని ప్రభుత్వానికి సూచించామన్నారు గవర్నర్ తమిళి సై. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ తమిళి సై ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతపై ప్రభుత్వానికి ఐదారు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు కరోనా టెస్ట్ లు చేస్తున్నట్లు ప్రభుత్వం సమర్ధించుకుంటోందని తమిళి సై అన్నారు. కోవిడ్ చికిత్స ప్రభుత్వానికి భారంగా మారిందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేకపోవడం వల్ల కరోనా రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నా రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారని ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు తమిళి సై.
ఇప్పుడు కేసీఆర్ కర్తవ్యమేమిటి..? తలవచుకోవడమేనా..?
కరోనా విషయంలో అన్ని మాటలు చెప్పి అంత త్వరగా చేతులెత్తేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దీనిపై ఏ రకంగా స్పందిస్తారు అనేది కీలకంగా మారింది. హైకోర్టులో ఎన్ని సార్లు మొట్టికాయలు వేయించుకున్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరగడం లేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 40 వేల నుండి 50వేల వరకు పరీక్షలు చేస్తూ ఉంటే.. తెలంగాణలో మాత్రం రోజుకు పాతిక వేలు కూడా చేయని పరిస్థితి నెలకొంది. అదే సందర్భంలో తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రులు విపరీతంగా దోచుకుంటున్నాయని, కరోనా పేరు చెప్పి దండుకుంటున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు రావడం, దీనిలో కొంత మంది అధికార పార్టీ ప్రముఖుల పాత్ర కూడా ఉందని రావడంతో ఇవి చిక్కుల రూపంలో కేసీఆర్ తలకు పట్టుకున్నాయి. మరో వైపు సచివాలయ బిల్డింగ్ కూల్చివేత అంశం, హైకోర్టులో కేసులు, ఉస్మానియా ఆస్పత్రిలో లీకేజీలు, వరదలు ఇవన్నీ కేసీఆర్ కు అష్టదిగ్బంధనం చేశాయి. వీటన్నిటితో పాటు గవర్నర్ తో కూడా పేచీ రావడం కెసిఆర్ కు ఇప్పట్లో సమస్యలు తీరేలా లేవు. అయితే తన మాటలతో వీటన్నింటినీ నెట్టుకు వస్తారో, చేతల ద్వారా చూపిస్తారా అనేది చూడాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?