బీజేపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వరంగల్లు బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపు వరంగల్లులో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేపు (శనివారం) హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో భారీ బహిరంగ సభకు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభకు అనుమతి లేదని పోలీసులు తెలియజేశారు. దీంతో కళాశాల యాజమాన్యం బీజేపీ నేతలు రెంట్ కింద చెల్లించిన రూ.5లక్షలు తిరిగి ఇచ్చేస్తూ కళాశాల గ్రౌండ్ ఇవ్వడం లేదని చెప్పింది. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా వస్తున్న నేపథ్యంలో బీజేపీ సభ విజయవంతానికి ఏర్పాట్లు చేసుకుంది. ఈ తరుణంలో అనుమతి లేదని చెప్పడంతో నేతలు ఖంగు తిన్నారు.
బీజేపీ సభకు అనుమతి కోరుతూ నేడు హైకోర్టులో బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, కళాశాలలో రాజకీయ పార్టీ సభ ఏర్పాటు చేయడంపై ప్రభుత్వ తరపు న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యతరం వ్యక్తం చేశారు. కళాశాల గ్రౌండ్ కు ఒకే ప్రవేశ ద్వారం ఉందనీ, ఇలాంటి ప్రదేశంలో భారీ బహిరంగ సభ కు అనుమతి ఇస్తే ప్రమాదమని అంతే కాకుండా రాజకీయ పార్టీల సభలకు కళాశాల ప్రాంగణం ఇవ్వడం మంచిది కాదని ఆయన తెలిపారు. దీనిపై పిటీషనర్ తరపు న్యాయవాది ఏజి వాదనను తప్పుబట్టారు. హన్మకొండ కళాశాలలో సభ ఏర్పాటు చేస్తున్న వాళ్లం తామే తొలి వాళ్లం కాదనీ, ఇంతకు ముందు చాలా పార్టీలు అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు రేపటి బీజేపీ సభకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.