హైదరాబాద్: టిఆర్ఎస్కు హైకోర్టు ఊహించని షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కిన నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
టిఆర్ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, సంతోష్కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. శాసనమండలి ఛైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టిఆర్ఎస్లో విలీనం చేయాలని గతంలో కాంగ్రెస్కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్కు లేఖ ఇవ్వగా ఆయన దాన్ని ఆమోదించారు.
అయితే ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9 ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.
అలాగే విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.