(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో విపక్ష ప్రజాప్రతినిధులను ఆకర్షించే ఆపరేషన్ కార్ – సర్కార్ జోరుగా కొనసాగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ను కలిసి తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరగా నేడు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. వారింకా పదవీ స్వీకార ప్రమాణం చేయక ముందే పార్టీని వీడి కారెక్కనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గంలోని కొందరు ముఖ్య నాయకులతో టీఆర్ఎస్లో చేరే విషయమై చర్చించినట్లు సమాచారం. టీఆర్ఎస్ నుండి ఆహ్వానం వచ్చిందనీ, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామనీ ఆయన చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్లో చేరడమే మంచిదని వారు సూచినట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్లో చేరే విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంతనాలు సాగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. సండ్ర ఉత్సాహం చూస్తే ఆయన రేపో మాపో పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ఇంకా ఏదీ తేల్చి చెప్పలేదంటున్నారు. సండ్ర వెంకటవీరయ్య పిలవడంతో ఖమ్మం వెళ్లానని మెచ్చా నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. పార్టీ మారే విషయమై సండ్ర తనతో చర్చించిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే తనకు టీడీపీని వీడే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు. తాను టీఆర్ఎస్లో చేరబోతున్నానంటూ వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని ఆయన ఖండించారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను పని చేస్తానని ఆయన ప్రకటించారు.
ఒకవేళ వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరిపోతే తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకిక ప్రాతినిధ్యం గల్లంతైనట్లే. విపక్షాలను చావు దెబ్బ తీసేందుకు కేసీఆర్ ఆపరేషన్ కార్ – సర్కార్ వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. మహాకూటమి ఘోర పరాజయం తర్వాత విపక్షాల్లో నైరాశ్యం కమ్ముకుంది. దాన్ని ఉపయోగించుకుని టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఫిరాయింపులకు తెరతీశారు. లోగడ కూడా సుమారు 30 మంది విపక్ష శాసనసభ్యులను ఆయన కారెక్కించుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?