హిందూత్వ ఎజెండాను ఎత్తుకోవడం ద్వారా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తప్పులో కాలేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.వైసీపీ ట్రాప్లో చంద్రబాబు చిక్కుకు పోయ్యారని వారు అంటున్నారు.ఏడాదిన్నర క్రితం అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వం టిడిపిని ముప్పుతిప్పలు పెడుతోంది.
టిడిపి ఎమ్మెల్యేలు నలుగురిని లాగేసుకోవటం మరికొందరికి గాలం వేయడంతో పాటు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర తదితరులను అరెస్టు చేయించటం,టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలికి తీయటం వంటి చర్యల ద్వారా జగన్ ..చంద్రబాబు నాయుడుకు నిద్రలేకుండా చేస్తున్నారు.దీంతో చంద్రబాబు కూడా అయోమయంలో పడిపోయారు ఎలాగ వైసీపీని ఎదుర్కోవాలో తెలియక తప్పు మీద తప్పు చేస్తున్నారంటున్నారు.ఇసుక కొరత, రాజధాని తరలింపు ,కరోనా సహాయక చర్యలు తదితర అంశాలను చంద్రబాబు పట్టుకుని జగన్ ప్రభుత్వం మీద పోరాడటానికి ప్రయత్నించినా ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు.దీంతో ఆయన తన పోరాట పంథాను మార్చుకున్నారు .ఇంతలో రాష్ట్రంలో కొన్ని మతపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.అంతర్వేది రధం దగ్దం, దుర్గ౬మ్మ గుడిలో రధంలో సింహాలు మాయమవ్వడం, మరికొన్ని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ,అపహరణ వంటి సంఘటనలు వరుసగా జరిగాయి.వెంటనే చంద్రబాబు వీటన్నిటిపైనా సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
అంతేగాక సిఎం జగన్ తిరుపతి పర్యటనకు వెళ్తుంటే ఆయన డిక్లరేషన్పై సంతకం పెట్టాలని భార్యతో కలిసే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఒక ప్రకటన కూడా చేశారు.నిజానికి టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావే తిరుమల బ్రహ్మోత్సవాల్లో భార్యతో కలిసి శ్రీవారికి పట్టు సమర్పించలేదు.ఆ విషయాన్ని మరుగునపెట్టి చంద్రబాబు జగన్ కు సుద్దులు చెప్పటం విమర్శలకు తావిచ్చింది.ఆలయాల్లో జరిగిన సంఘటనలపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా చాలా మందికి రుచించడం లేదు.అయితే రాష్ట్రంలో ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేక బీజేపీకి దగ్గరవడం కోసం చంద్రబాబు హిందూత్వ అజెండాను పట్టుకునే ప్రయత్నం చేసి రాష్ట్రంలో ఒక వర్గానికి దూరమైపోయారని టిడిపి వర్గాలే భావిస్తున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ బీజేపీలో కలహించుకుంటూనట్లు కనిపిస్తున్నా ఢిల్లీలో వారి దారులు ఒకటిగానే ఉన్నాయి.దీన్ని కూడా చంద్రబాబు గ్రహించలేక బిజెపిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవడానికి తన పంథా మార్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.చంద్రబాబు బుర్రను కూడా పని చేయనీయనంత వేగంగా వైసిపి ప్రభుత్వం ఆయన్ను గందరగోళ పరుస్తోందనడానికి ఇదే నిదర్శనం.